దారుణం: తల్లితో సహజీవనం చేస్తూ.. కొడుకునే చంపేశాడు
హైదరాబాద్: తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. తనతో గొడవకు దిగిన ఆమె కుమారుడ్ని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శామిర్పేట్లో చోటు చేసుకుంది. ఈ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు
శామిర్పేట్ పోలీస్ష్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ అశోక్కుమార్, సీఐ సత్తయ్యతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. మూడుచింతలపల్లికి చెందిన బుడగజంగం చింతల గోపాల్(52) పశువుల కాపరి. అతడు మెదక్ జిల్లా గజ్వేల్కు చెందిన సత్తమ్మతో సహజీవనం చేస్తూ మజీద్పూర్లో ఉంటున్నాడు.
కాగా, సత్తమ్మకు ఓ కూతురుతోపాటు కుమారుడు ఐలయ్య(28) ఉన్నాడు. ఐలయ్య గజ్వేల్లోని ఓ సినిమా థియేటర్లో పనిచేస్తూ తరచూ తల్లి వద్దకు వస్తుండేవాడు. అయితే, తల్లితో గోపాల్ సంపాదన విషయంలో ఐలయ్య గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో జులై 26న సాయంత్రం ఐలయ్య మజీద్పూర్ వచ్చి ఇంటి అరుగు మీద పడుకున్నాడు.

అయితే, తల్లితోపాటు వచ్చిన గోపాల్తో అతడు తిరిగి డబ్బుల విషయమై గొడవపడ్డాడు. రాత్రి 9గంటల సమయంలో సత్తమ్మ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించింది. అనంతరం ఐలయ్య, గోపాల్తో మళ్లీ ఘర్షణకు దిగారు.
గోపాల్ను చంపుతానని ఐలయ్య బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఐలయ్యతో తనకు ఎప్పటికైనా ముప్పు పొంచి ఉందనుకున్నాడు గోపాల్.
ఈ క్రమంలో ఐలయ్యను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదేరోజు రాత్రి 11:30 గంటలకు గోపాల్ తన ఇంట్లో ఉన్న రాతి రోలును ఐలయ్య తలపై మోదడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఐలయ్య చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన గోపాల్ ఇంట్లో మృతదేహం ఉంటే తనపై అనుమానం వస్తుందని భావించి.. గ్రామ పంచాయతీ చెత్త తీసుకెళ్లే రిక్షాను తీసుకొచ్చి ఐలయ్య మృతదేహాన్ని గ్రామ శివారులోని మజీద్పూర్-మేడ్చల్ రహదారి పక్కన పడేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన వెలుగుచూసిన రోజు పోలీసులు క్లూస్ టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. హతుడి తల్లి సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. ఈమేరకు గోపాల్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరుపగా హత్య విషయం అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications