విషాదాంతం: ‘నీలోఫర్’లో కిడ్నాపైన శిశువు మృతి: నిందితురాలి అరెస్ట్, ‘ఆ ప్రకటనే పట్టించింది’
హైదరాబాద్: నగరంలోని నీలోఫర్ ఆసుపత్రి నుంచి గత ఆదివారం అపహరణకు గురైన శిశువు ఘటన విషాదాంతమైంది. చిన్నారిని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లిన ఆదివారంనాడే మరణించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మంగళవారం సాయంత్రం నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Recommended Video
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బందొడ్డిపల్లి గ్రామానికి చెందిన సత్తూరు మంజులగా గుర్తించారు. చిన్నారి పుట్టినపుడే న్యుమోనియాతో బాధపడటం మరణానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గత ఆదివారం నీలోఫర్ ఆసుపత్రి వద్ద శిశువు అపహరణకు గురైన విషయం తెలిసిందే. అక్కడ సీసీ పుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితురాలు ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు. ఆటోవెనక 'టీవీఎస్' అనే ప్రకటన ఉండటంతో దాని ఆధారంగా దర్యాప్తు సాగించారు.
శిశువుతోపాటు నిందితురాలు లక్డీకాపూల్ సంధ్య హోటల్ వద్ద దిగినట్లు ఆటోడ్రైవర్ నుంచి రాబట్టారు. అక్కడి నుంచి ఆమె పేట్లబురుజు ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ మరొకరితో కలిసి కల్వకుర్తి వైపు వెళ్లే బస్సులో ఎక్కిన దృశ్యాల్ని సేకరించారు. అయినా ఆచూకీ దొరక్కపోవడంతో సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పలు బృందాల్ని రంగంలోకి దించారు. వారిని కల్వకుర్తి, అమన్గల్, వెల్దండ ప్రాంతాల్లోకి పంపించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మంజుల సమాచారం లభించింది.
మంగళవారం రాత్రి 10గంటల సమయంలో రాజేంద్రనగర్ పరిసరాల్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని బందొడ్డిపల్లి గ్రామంలో పొలంలో ఖననం చేసినట్లు నిందితురాలు వెల్లడించింది.
కిడ్నాప్కు ముందు ఏం జరిగిందంటే..
హైదరాబాద్లోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన పాండు భార్య నిర్మల శుక్రవారం పేట్లబురుజు ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు ఆరోగ్యం బాగా లేకపోవడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తీసుకువస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా కేసముద్రానికి చెందిన మంజుల, నాగర్కర్నూల్ జిల్లా వెల్దండి మండలం బండరోనిపల్లికి చెందిన కుమార్గౌడ్ కొన్నేళ్ల కింద హైదరాబాద్లోని కాటేదాన్ పారిశ్రామికవాడకు వలస వచ్చారు. అక్కడ వారికి పరిచయం ఏర్పడి మూడేళ్ల కింద వివాహం చేసుకున్నారు. మంజుల పలు గర్భం దాల్చినా వరుసగా అబార్షన్లు కావడంతో తమకు పిల్లలు పుట్టే అవకాశం లేదని భావించింది. రెండు నెలల కింద ఆరు నెలల గర్భం కూడా పోయింది.
అయినా భర్తకు చెప్పకుండా దాచిన ఆమె.. ప్రసవం కోసమంటూ ఓ మహిళతో కలసి పేట్లబురుజు ఆస్పత్రికి వచ్చింది. అక్కడ ఎవరైనా తనకు శిశువును ఇస్తే.. తమ బిడ్డగా భర్తకు చూపాలని భావించింది. శనివారం రోజంతా ఆస్పత్రిలోనే ఉండి.. ఆయాగా చెప్పుకుంటూ తిరిగింది. చివరికి ఆస్పత్రిలో నిర్మల కుమారుడిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుని.. వారితో పరిచయం పెంచుకుంది. ఆదివారం శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళుతుండగా తాను సహాయంగా ఉంటానంటూ మంజుల కూడా వెళ్లింది. నీలోఫర్ ఆస్పత్రిలో స్కానింగ్ తీసిన అనంతరం శిశువు బంధువులు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి.. శిశువుతో ఉడాయించింది.