నిజంగానా: కెసిఆర్ ఆయుత చండీయాగంపై కర్నాటక సీఎం కామెంట్!
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూఢ నమ్మక వ్యతిరేక బిల్లు పైన కృషి చేస్తున్నారు. అలాగే, జ్యోతిషశాస్త్రం తదితర కార్యక్రమాలను టీవీలలో నిషేధించనున్నారు. టీవీ కార్యక్రమాల్లో జ్యోతిష్య శాస్త్రం తదితరాలను నిషేధించడానికి తానే ఓ నిదర్శనం అని సిద్ధరామయ్య అంటున్నారు.
తన విషయంలో జ్యోతిష్యులు చెప్పింది ఏదీ నిజం కాలేదని ఆయన అన్నారు. తన విషయంలో జ్యోతిష్యులు చెప్పింది ఎప్పుడూ నిజం కాలేదన్నారు. మూఢ నమ్మక వ్యతిరేక బిల్లు ఏ మతానికి వ్యతిరేకం కాదని, అన్ని మతాలకు సంబంధించిందని అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల నిర్వహించిన ఆయుత చండీయాగం పైన కూడా ఆయన స్పందించారని వార్తలు వస్తున్నాయి.
ఇటీవల డిసెంబర్ 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్ అయుత మహా చండీయాగం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రుత్విక్కులను పిలిపించి దీనిని నిర్వహించారు. ఈ యాగానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు.
కర్నాటక విధాన సౌధలో జరిగిన కవి కువెంపు జయంతి వేడుకల సందర్భంగా సిద్ధరామయ్య చండీయాగాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ కేసీఆర్ చండీయాగం చేశారని, హోమాలు చేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈ విషయంలో శాస్త్రీయత ఉందా? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు.
యాగాలు చేస్తే వర్షాలు కురుస్తాయా? అదే నిజమైతే దేశంలో కరవు ఛాయలే కనిపించేవి కావని, యావత్తు దేశాన్నే సుభిక్షం చేసేవాళ్లమని ఆయన అన్నారు. విద్యావంతులు కొన్ని విషయాలను గుడ్డిగా నమ్మడం బాధ కలిగిస్తోందన్నారు.