పెళ్లింట ‘పెద్ద’ తంటా!: రూ. 2.5 లక్షలపై సమాచారం లేదని బ్యాంకర్లు, పెద్దల అయోమయం
శుభలేఖ, తగిన ఆధారాలు చూపి రూ. రెండున్నర లక్షలను బ్యాంకుకు వెళ్లి తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కానీ, క్షేత్ర స్థాయిలో ఇది అమలు కావడం లేదు.
వరంగల్: ఆకాశమంత పందిరి వేయాలన్నా, భూ దేవంత పీటలు పరచాలన్నా, అతిథులకు కమ్మని విందు భోజనం వడ్డించాలన్నా, భాజాభజంత్రీలు మోగాలన్నా... ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. పెద్దనోట్ల రద్దుతో ప్రస్తుతం పెళ్లి వారికి పెద్ద కష్టమే వచ్చి పడింది. డబ్బులు చేతిలో లేక వారు పడుతున్న పాట్లను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఉపశమనంగా ఒక నిర్ణయం తీసుకుంది. పెళ్లి అవసరాలకు ప్రత్యేక మినహాయింపునిచ్చింది.
శుభలేఖ, తగిన ఆధారాలు చూపి రూ. రెండున్నర లక్షలను బ్యాంకుకు వెళ్లి తీసుకోవచ్చని ప్రకటించింది. కానీ, క్షేత్ర స్థాయిలో ఇది అమలు కావడం లేదు. చేసేదేంలేక పెళ్లివారు వెనుదిరుగుతున్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ అధికారిక వెబ్సైట్లో మార్గదర్శకాలు పెట్టింది. ఈ విషయమై పలువురు బ్యాంకు మేనేజర్లను సంప్రదించగా, తాము పెళ్లికి రూ. రెండున్నర లక్షలు ఇవ్వొచ్చనే విషయాన్ని పత్రికల్లో చదివామని, టీవీల్లో చూశామే తప్ప ఆర్బీఐ నుంచి తమకెలాంటి ఆదేశాలు రాలేదని చెప్పడం గమనార్హం.
పెద్ద ఎత్తున పెళ్లిళ్లు
వరంగల్లోని ప్రముఖ పురోహితులు గంగు ఉపేందర్శర్మ, సిద్ధేశ్వర శర్మలను సంప్రదిస్తే కార్తీక మాసంలో ఐదు జిల్లాల వ్యాప్తంగా సుమారు 5 వేల పెళ్లిళ్లు జరుగుతాయని అన్నారు. నవంబర్ 24న మంచి ముహూర్తం ఉందన్నారు. ఆ ఒక్కరోజే వందలాది వివాహాలు ఉన్నాయని వివరించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు పెద్ద సంఖ్యలో ఇబ్బందులు పడుతున్నారు. కొందరేమో తమ ఖర్చుల్ని వాయిదా వేసుకుంటున్నారు.
కానీ, పెళ్లి ముహూర్తాలు ముందే పెట్టుకున్నందున ఈ సమయంలో ఎలాగైనా జరిపించి తీరాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా డబ్బులు అందిస్తే ఎంతో ఉపశమనం లభిస్తుంది. కేంద్ర ప్రకటన అనుసారం బ్యాంకర్లు డబ్బులు ఇస్తే సులువుగా పెళ్లిళ్లకు శుభం కార్డు పడుతుంది.
బ్యాంకులు ఖాళీ
సిరా చుక్క నిబంధన తర్వాత బ్యాంకుల్లో రద్దీ తగ్గింది. పైగా శనివారం కేవలం ఖాతాదారులకే బ్యాంకులు సేవలందిస్తామని, వయోవృద్ధులకు మాత్రం మినహాయింపు ఉందని ప్రకటించడంతో నగదు మార్పిడికోసం వచ్చే క్యూలు తగ్గాయి. కాగా ఏటీఎం ముందు మాత్రం జనాలు బారులు తీరి కనిపించారు. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బులు నిండుకోవడంతో 'నో క్యాష్' బోర్డులే దర్శనమిస్తున్నాయి.
ఐదు జిల్లాల పరిధిలో కొన్ని పెట్రోలు బంకుల వారు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పాత నోట్లను తీసుకునేది లేదని వినియోగదారుల్ని వెనక్కి పంపుతున్నారు. మొన్నటి వరకు పాత నోట్లను అనుమతించారు. తాజాగా పలు పెట్రోలు బంకుల్లో పాత నోట్లను తీసుకోకపోవడం గమనార్హం. కొందరు ఆస్పత్రుల యాజమాన్యాలూ పాత నోట్లను తీసుకునేది లేదని తెగేసి చెబుతున్నాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.