బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఫేస్బుక్ హ్యాక్: స్పందించవద్దంటూ ట్వీట్
హైదరాబాద్: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులతోపాటు ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా, బీఆర్ఎస్ నేత, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డి ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయ్యింది. సైబర్ నేరగాళ్లే ఎంపీ ఖాతాను హ్యాక్ చేశారు.
ఈ విషయాన్ని ఆదివారం రాత్రి గుర్తించిన ఎంపీ రంజిత్ రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. తన పేరుతో వచ్చే పోస్టులకు, మెసేజ్ లకు ఎవరూ స్పందించవద్దని ట్విట్టర్ వేదికగా సూచించారు.
ఈ మేరకు రంజిత్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఎంపీ ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేసింది నైజీరియా లేదా ఈజిప్టునకు చెందిన నేరగాళ్ల పనిగా పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు.
!Important!
— Dr Ranjith Reddy - BRS (@DrRanjithReddy) January 23, 2023
To all my friends and followers, please note that my #Facebook account has been hacked. Request everyone not to entertain and respond to any messages or requests made through that account.
Thank you.
సైబర్ నేరగాళ్లు అమాయకులను, నిరక్షరాస్యులనే కాకుండా ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. పెరిగిన సాంకేతికతను వాడుకుంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఏదో కానుక వచ్చిందని, బహుమతి గెల్చుకున్నారని చెప్పి.. డబ్బులు లాగుతున్నారు. అసలు విషయం తెలియని జనం ముందు డబ్బులు కట్టి.. ఆ తర్వాత మోసపోయామని తెలిసి.. లబోదిబో మంటున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్లతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నప్పటికీ.. జనాల్లో సరైన అవగాహన లేక మోసపోతూనే ఉన్నారు.