సిపిఐ నారాయణను అడగండి: కడియంపై మందకృష్ణ ఎదురుదాడి
హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పియస్) వ్యవస్థాపకుడు తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరిపై ఎదురుదాడికి దిగారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అఖిల పక్ష నేతలకు తీసుకుని వెళ్లడానికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరకడం లేదనే కడియం మాటలను ఆయన తప్పు పట్టారు.
ప్రతిపక్ష నేతలకే మోడీ అపాయింట్మెంట్ దొరికినప్పుడు అనుకూలంగా వ్యవహరిస్తున్న మీకు ఎందుకు దొరకదని ఆయన అడిగారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మోడీని నారాయణ కలిశారు...
సిపిఐ నేత నారాయణ ప్రధాని మోడీని కలిశారని, నారాయణకు అపాయింట్మెంట్ దొరికినప్పుడు మీకు ఎందుకు దొరకదని మందకృష్ణ మాదిగ అన్నారు. మోడీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో నారాయణను అడగాలని ఆయన కడియం శ్రీహరికి సూచించారు.

చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు...
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని ఆయన విమర్శంచారు. మాదిగలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి, టిడిపి మోసం చేశాయని ఆయన విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో అసలు దోషి బిజెపి అని ఆయన అన్నారు.

అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు...
కడియం శ్రీహరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కడియం శ్రీహరి పాత్ర గతంలో కన్నా తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను వేసిన 13 ప్రశ్నలకు కెసిఆర్ గానీ కడియం శ్రీహరి గానీ సమాధానం చెప్పలేదని అన్నారు. తమ పోరాటం గల్లీలో జరిగిందో, ఢిల్లీలో జరిగిందో ఒక్కసారి పరిశీలించి చూడాలని ఆయన కడియం శ్రీహరికి సూచించారు.

మేం కాంగ్రెసును నమ్మడం లేదు...
తాము ఏ పార్టీకి కూడా కొమ్ము కాయడం లేదని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీని తాము నమ్మడం లేదని ఆయన అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసే అవకాశం ఉన్నా గత యుపిఎ ప్రభుత్వం చేయలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications