నన్ను హేళన చేసినప్పుడల్లా గాంధీనే స్మరించుకునేవాడిని: సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: మహాత్మా గాంధీ ప్రతి మాటా.. ప్రతి అడుగూ ఆచరణీయమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆవరణలో గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ 16 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహాత్ముతుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గాంధీ ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను, కరోనా కాలంలో ధైర్యం పనిచేసిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.
మంత్రి తలసాని కీర్తి చిరస్థాయిగా అంటూ కేసీఆర్..
ధ్యానమూర్తిలో ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించడం గొప్ప విషయం. విగ్రహ ఏర్పాటుతో మంత్రి శ్రీనివాస్కు చిరస్థాయి కీర్తి దక్కుతుంది. కరోనా విపత్తు వేళ గాంధీ ఆస్పత్రి సేవలు ప్రశంసనీయం. గాంధీ వైద్య సిబ్బంది ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్నారు. మిగతా ఆస్పత్రుల్లో తిరస్కరించినా ఇక్కడికి తెచ్చి రోగుల ప్రాణాలు కాపాడారు.
గాంధీ స్ఫూర్తితో పనిచేసిన సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నా. గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనందరం చేసుకున్న పుణ్యం. గాంధీజీ విశ్వజనీన సిద్ధాంతాలు ప్రతిపాదించారు. అహింస, శాంతి, ధర్మం, సేవ, త్యాగనిరతి సిద్ధాంతాలు విశ్వజనీనం అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అహింస సిద్ధాంతంతో గాంధీజీ.. బ్రిటీష్వారిపై పోరాడి విజయం సాధించారని కేసీఆర్ కొనియాడారు.
గాంధీ అహింసా మార్గం.. నేతాజీ ప్రత్యామ్నాయం..: కేసీఆర్
సమస్యలకు యుద్ధాలు పరిష్కారం కాదని చాటిచెప్పిన మహనీయుడు గాంధీ అని కేసీఆర్ కొనియాడారు. మార్టిన్ లూథర్ వంటి వారు గాంధీ మార్గాన్ని అభినందించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దలైలామా సైతం గాంధీ తనకు ఆదర్శం అని చెప్పారన్నారు. గాంధీజీని రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్ముడిగా సంబోధించారన్నారు. అహింసతో స్వరాజ్యం సాదిద్ధామని గాంధీజీ ప్రతిపాదించారన్నారు.
అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించారని కేసీఆర్ తెలిపారు. గాంధీ అహింస అన్నారు, మీరు మిలిటరీ స్థాపిస్తున్నారని బోస్ను మీడియా ప్రతినిధులు అడిగారన్నారు. అహింసా మార్గంలోనే స్వాతంత్ర్యం రావాలని కోరుకుంటున్నట్లు బోస్ చెప్పారు.. అహింసా మార్గంలో రాకపోతే సాయుధ పోరాటానికి సైన్యం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారని సీఎం కేసీఆర్ తెలిపారు.
కేంద్రంపై కేసీఆర్ పరోక్ష విమర్శలు
గాంధీజీ ప్రతి మాట, అడుగు ఆచరణాత్మకంగా ఉండేవి. ఆయన పోరాటం చూసి ఎందరో మహనీయులు స్ఫూర్తిని పొందారని సీఎం కేసీఆర్ అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టిన రోజు కూడా ఇవాళే. జై జవాన్, జై కిసాన్ నినాదం ఇచ్చారు శాస్త్రి. దేశంలో ఎం జరుగుతుందో అందరూ గమనించాలి. చెడును ఖండించాలి, మౌనం పనికి రాదు. జై జవాన్ అగ్నిపథ్లో నలిగి పోతున్నారు. కిసాన్ మాత్రం మద్దతు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ కేంద్రం పథకాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించారు.
తనను హేళన చేశారంటూ కేసీఆర్ కామెంట్స్
ఇక బక్కపల్చనివాడు ఏం చేస్తారని తనను చాలా మంది అవహేళన చేశారని.. అప్పుడు తాను గాంధీజీనే సర్మించుకునేవాడినని చెప్పారు కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతికి ఆయనే ప్రేరణ అని అన్నారు. గాంధీజీనే అవమానించే పరిస్థితులను చూస్తున్నామని, వెకిలి వ్యక్తులు చేసే హేళనల వల్ల మహాత్ముడి గొప్పతనం తగ్గదన్నారు. మరుగుజ్జులు మహాత్ములు కాలేరని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందు సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు.