కిషన్ రెడ్డికి 'డెత్ వార్నింగ్': రాత్రివేళ ఫోన్, చంపేస్తామంటూ..
గత వారం రోజులుగా చంపేస్తామని బెదిరిస్తూ రాత్రిపూట పలు ఫోన్ కాల్స్ రావడంతో నారాయణ గూడ, కాచిగూడ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లను 12శాతానికి పెంచుతూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ఓవైపు హర్షం వ్యక్తం అవుతుండగా.. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్లకు ఆస్కారం కల్పించవద్దని బీజేపీ వాదిస్తుండగా.. ఇది సామాజిక పరమైన అంశమేనని ప్రభుత్వం చెబుతోంది.
ముస్లిం రిజర్వేషన్లపై ఆదివారం నాడు ప్రభుత్వం అసెంబ్లీని ఏర్పాటు చేయగా.. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బీజేపీ తీరుపై విమర్శలు మొదలయ్యాయి. తాజాగా ఇదే కారణంతో కిషన్ రెడ్డికి బెదిరింపులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా చంపేస్తామని బెదిరిస్తూ రాత్రిపూట పలు ఫోన్ కాల్స్ రావడంతో నారాయణ గూడ, కాచిగూడ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
కిషన్ రెడ్డి ఫిర్యాదుపై ఆరా తీసిన సైబర్ క్రైమ్ పోలీసులు..బెదిరింపు ఫోన్ కాల్స్ షార్జా నుంచి వచ్చినట్లు గుర్తించారు. కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ ఆయన కార్యాలయానికి, నివాసానికి ఫోన్ కాల్స్ వస్తుండటంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.