దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు: ఆరుగురిని దోషులుగా తేల్చిన కోర్టు
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థపై నేరారోపణ రుజువైంది. దీంతో ఆరుగురు నిందితులను దోషులుగా తేల్చడం జరిగింది.
ఆరుగురు దోషులల్లో ప్రధాన దోషి రియాజ్ భత్కల్ పరారీలో ఉండటంతో మిగితా దోషుల శిక్ష ఖరారును సోమవారాని(డిసెంబర్ 19)కి వాయిదా వేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఎన్ఐఏ బలమైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంతో దోషులను తేల్చింది కోర్టు. ఇప్పటి వరకు 157మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.

కాగా, 2013, ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో 19 మంది మృతి చెందగా, 131మందికి గాయాలయ్యాయి. ఐదుగురు నిందితులు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తుండగా, పేలుళ్లకు ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు.
ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మూడున్నరేళ్లుగా కేసు విచారణ జరిపింది. మొత్తం 157మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి... ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. 502 దస్త్రాలను, 201 వస్తువులను సాక్ష్యాలుగా పరిశీలించింది. సరూర్నగర్, మలక్పేట పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది.
ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ ప్రధాన సూత్రధారిగా నిర్ధరించింది. అసదుల్లా అక్తర్ వకాస్, తెహసీన్ అక్తర్లు ప్రత్యక్షంగా సైకిళ్లపై బాంబులు పెట్టి పేల్చినట్లు ఎన్ఏఐ ఆధారాలు సేకరించింది. యాసిన్ భత్కల్, ఐజాజ్ షేక్లు కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది.
వకాస్ పాకిస్థాన్ జాతీయుడు కాగా.. మిగిలినవారు కర్ణాటక, బీహార్, యూపీకి చెందిన వారు. అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఐజాజ్షేక్లు చర్లపల్లి జైల్లో ఉండగా.. రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. కాగా, రియాజ్ పాకిస్థాన్లో ఉండొచ్చని ఎన్ఐఏ అనుమానిస్తోంది.












Click it and Unblock the Notifications