కలకలం: ట్యాంక్ బండ్పై ఒకేసారి ఐదుగురు ఆత్మహత్యాయత్నం.. ఎవరు?
తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకు చెందిన ఎం.కె.సంధ్య (36) భర్త ప్రవర్తనతో విసిగిపోయింది. మరో మహిళతో అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం.. సంధ్యను పూర్తిగా పట్టించుకోకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది
హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ చుట్టూ 'ఆత్మహత్య మహా పాపం' అన్న కొటేషన్స్ చాలానే కనిపిస్తాయి. కానీ అవేవీ వారిని నియంత్రించలేకపోయాయి. ఆత్మహత్యే శరణ్యమనుకుని.. ఐదుగురు వ్యక్తులు హుస్సేన్ సాగర్ లో దూకడానికి ప్రయత్నించారు.
అయితే సకాలంలో పోలీసులు వారిని గుర్తించడంతో పెద్ద విషాదం తప్పింది. ఆ ఐదుగురిని ఆత్మహత్య చేసుకోనివ్వకుండా అడ్డుపడ్డ పోలీసులు.. అనంతరం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అటుపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారిని తీసుకెళ్లాల్సిందిగా కోరారు.
ఎవరా ఐదుగురు?
హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఐదుగురిలో.. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతం నుంచి వచ్చినవారు. ఇందులో వివాహితలు, ఇంకా పెళ్లి కాని యువకులు కూడా ఉన్నారు. భర్తల వేధింపులు తాళలేక కొందరు, తాగుడుకి బానిసై ఒకరు, మానసిక స్థితి సరిగా లేక ఇంకొకరు.. ఇలా కారణమేదైనా.. వీరందరికి ఆత్మహత్యే శరణ్యమని తోచడం గమనార్హం.
పార్శిగుట్ట సతీశ్:
పార్శీగుట్టకు చెందిన బి.సతీష్ (26) గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికెళ్లాడు. ఇంట్లో తల్లి సహా సోదరుడు అతన్ని గట్టిగా మందలించారు. ఇలాగే తాగితే భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. వారి మాటలకు నొచ్చుకున్న సతీష్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఆ ప్రాంతానికి వచ్చాడు.
హబ్సిగూడకు చెందిన వివాహిత:
హబ్సిగూడకు చెందిన ఊర్మిళ(43) అనే మహిళ భర్తతో విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి ఉంటోంది. గురువారం రాత్రి దగ్గరి బంధువు ఒకరితో గొడవ చోటు చేసుకోవడంతో... తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుని ఆత్మహత్యకు యత్నించబోయింది.
మానసకి రుగ్మతతో మరో యువకుడు:
అబిడ్స్ లోని చిరాగ్ లైన్ ప్రాంతానికి చెందిన హపీజ్ (24) అనే యువకుడు చాలాకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇంటి నుంచి పారిపోయి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని యత్నిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు.
తిరుమలగిరికి చెందిన మరో వివాహిత:
తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకు చెందిన ఎం.కె.సంధ్య (36) భర్త ప్రవర్తనతో విసిగిపోయింది. మరో మహిళతో అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం.. సంధ్యను పూర్తిగా పట్టించుకోకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. కొంతకాలంగా ఇదే ఆవేదనతో మానసిక సంఘర్షణకు గురవతూ వస్తోంది. గురువార రాత్రి తీవ్ర ఆవేదనతో ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుని ఆత్మహత్యకు యత్నించింది.
భర్త తాగుడు భరించలేక:
కుషాయిగూడకు చెందిన బి.షైనే(21) నిత్యం భర్త తాగుడును భరించలేకపోయింది. నిత్యం తాగొచ్చి గొడవపడటం తనను మానసిక క్షోభకు గురిచేసింది. దీంతో భర్తతో నరకం కన్నా ఆత్మహత్యే మేలని హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది.
బ్లూ కోట్స్ కానిస్టేబుల్స్ అప్రమత్తతో:
ఈ ఐదుగురు ఒకేసారి ఆత్మహత్యకు యత్నించడంతో.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న బ్లూకోట్స్ కానిస్టేబుల్స్ ఎన్.శ్రీనివాస్, సి.సాయికిరణ్, ఫజల్ అహ్మద్ ఖాన్, బి.నీర్జూ, ఇస్మాయిల్ బిన్ సలామ్, హోంగార్డు పి.వెంకట్రావు, డి.రవి జీవన్ వీరిని గుర్తించారు.
తక్షణం స్పందించి వారిచేత ఆ ప్రయత్నం విరమింపజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించి.. బంధువులకు సమాచారం అందించారు.