పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఫ్లెక్సీల కలకలం.. ఏమైనా ప్రకటిస్తారా? అమిత్ షా, కేంద్రం టార్గెట్!!
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలిసారిగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ రోజు బీజేపీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేసింది. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. జాతీయ జెండాను ఎగురవేసి హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
తెలంగాణా విమోచనా దినోత్సవ వేడుకలకు అమిత్ షా... ఫ్లెక్సీల కలకలం
ఈ క్రమంలో శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న అమిత్ షా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆపై జరగనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. అయితే అమిత్ షా వచ్చిన నేపథ్యంలో బిజెపికి వ్యతిరేకంగా పెరేడ్ గ్రౌండ్స్ పరిసరాలలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. సెప్టెంబర్ 17న తెలంగాణకు ఏమి ఇస్తారు? రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవి అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
గోవా లిబరేషన్ డే కు కేంద్రం నిధులు.. తెలంగాణాకు ఏం ఇస్తారు.. అని ప్రశ్న
ఇక ఈ ఫ్లెక్సీలలో గోవా లిబరేషన్ డేకు కేంద్రం రూ.300 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో తెలంగాణ విమోచన దినం అంటూ చెబుతున్న బిజెపి ప్రభుత్వం ఎందుకు ఒక్కరూపాయి ఇవ్వలేదంటూ ఫ్లెక్సీలలో ప్రశ్నించారు. అమిత్షా తెలంగాణకు ఇవాళ ఏమైనా ఇస్తారా? అంటూ ఫ్లెక్సీల ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షాకు సూటి ప్రశ్నలు వేశారు.
సిరిసిల్లలోనూ అమిత్ షా పర్యటనపై కేటీఆర్ మండిపాటు.. ఊకదంపుడు ఉపన్యాసాలేనా? ప్రశ్న
ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడంపై సిరిసిల్లలో జరిగిన తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలలో మంత్రి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని, వస్తూ ఏమైనా తెస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకోవడానికి మాత్రమే అమిత్ షా వస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న బీజేపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలలో మత విద్వేషాలు రగల్చటం కోసం బిజెపి నాయకులు పని చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.