Alert: ఫేక్ యాప్తో రూ. 100 కోట్ల బురిడీ: పరారీలో నిందితుడు ముక్తిరాజ్
హైదరాబాద్: ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో ఘరానా మోసం వెలుగుచూసింది. రూ. లక్ష పెట్టుబడితో కేవలం 8 నెలల్లోనే రూ. 4 కోట్లు మీ సొంతం చేసుకోండంటూ నకిలీ యాప్తో ఏకంగా రూ. 100 కోట్ల వరకు బురిడీ కొట్టించాడు మల్టీజెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ టేకుల ముక్తిరాజ్.
తొలుత లాభాలు పంచి నమ్మించాడు
సాధారణంగా ఆన్లైన్ ట్రేడింగ్కు సెబీ గుర్తించిన సాంకేతికతను వినియోగించాలి. నిందితుడు తన ప్లాన్ను అమలు చేసేందుకు సొంతంగా మల్టీజెట్ లిమిటెడ్ పేరుతో ఓ యాప్ తయారు చేయించాడు. బంగారం, బొగ్గు, గ్యాస్ పై ఆన్లైన్ ట్రేడింగ్ చేయించి.. నిజంగానే లావాదేవీలు జరిగినట్లు నమ్మించాడు. తొలుత కొందరు పెట్టుబడి పెట్టాక వారికి లాభాలు ఇచ్చాడు.
భారీ మొత్తంలో పెట్టుబడులు: రూ. 100 కోట్లతో టోకరా
ఈ క్రమంలో అతడ్ని నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన తర్వాత బోర్డు తిప్పేయాలని చూశాడు. అయితే, అతని మోసం వెలుగులోకి రావడంతో పరారయ్యాడు. దీంతో మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ మోసంపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భారీగా పెట్టుబడులు స్వీకరించిన ముక్తిరాజ్ దాదాపు రూ. 100 కోట్లపైనే మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడు తయారుచేసిన యాప్ లోని లావాదేవీల ఆధారంగా ఈ మేరకు గుర్తించారు.
కోట్లు మళ్లించాడు.. బ్యాంక్ ఖాతాలో లక్షలు మాత్రమే
మల్టీజెట్ ప్రైవేట్ లిమిటెడ్, రియల్ లైఫ్ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయగా.. రూ. 12 లక్షలు మాత్రమే ఉన్నట్లు తేలింది. మిగిలిన డబ్బు డ్రా చేసినట్లు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఎలా మళ్లించారనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంస్థ ఖాతాల్లోని నగదు వారం రోజుల క్రితమే ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. నేరుగా కొందరు బాధితులు నగదు ఇవ్వడంతో ఆ మొత్తాన్ని రోజటికి రోజు మరో చోటికి తరలించేవారని గుర్తించారు.
పరారీలో ముక్తిరాజ్.. గతంలోనూ మోసాలు
కాగా, దర్యాప్తులో భాగంగా మల్టీజెట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాప్ తయారుచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముక్తిరాజ్ కుటుంబసభ్యులు, సంస్థలో పనిచేసేవారు, మరికొంతమంది బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. ముక్తిరాజ్ గతంలో నివసించిన రామాంతపూర్, ముషీరాబాద్లోనూ ఇలా మోసాలు చేశాడు. అప్పట్లో నమోదైన కేసులను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. ముక్తిరాజ్ గతంలో వరంగల్, హైదరాబాద్లోని సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడని తెలిసి కూడా కొందరు జైలు సిబ్బంది అతడ్ని నమ్మి పెట్టుబడి పెట్టడం చర్చనీయాంశంగ ామారింది. నిందితుడ్ని అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.