ఒక ప్రణాళిక ప్రకారమే చేశాడు, నాముందే వాడినీ కాల్చేయాలి: సంధ్య తల్లి ఆక్రోశం
హైదరాబాద్: ప్రేమోన్మాది కార్తీక్ ఎలాగైతే తన కుమార్తె సంధ్యను పెట్రోల్ పోసి తగులబెట్టాడో.. అదే విధంగా వాడినీ తన ముందు పెట్రోల్ పోసి కాల్చేయాలని సంధ్య తల్లి ఆక్రోశించింది. కార్తీక్ ఒక ప్రణాళిక ప్రకారమే సంధ్యను తగలబెట్టాడని, తర్వాత రక్షణ కోసమే పోలీసుల ఎదుట లొంగిపోయాడని సంధ్య తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
''ఈ కేసులో వాడికి తర్వాత శిక్ష పడొచ్చు.. అది వేరే విషయం.. కానీ కనిపిస్తే ఎక్కడ చితగ్గొడతారో అని.. తనను తాను రక్షించుకునేందుకే వాడు తెలివిగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు..'' అని ఆమె పేర్కొంది.
అంతటా జనసమ్మర్ధం.. అంతలో...
గురువారం సాయంత్రం 6.30 గంటలు.. ఆ వీధి అంతా జనసమ్మర్ధంతో నిండిఉంది. కార్యాలయాల నుంచి తిరిగి వచ్చేవారు.. కూరగాయల కోసం బయటికి వచ్చిన వారు.. ఆడుకునే పిల్లలతో సందడిగా ఉంది. ఇంతలోనే మంటల్లో చిక్కుకున్న ఓ యువతి ఆర్తనాదాలు.. అందరూ నిశ్చేష్ఠులయ్యారు. తేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. 108కు సమాచారం అందించారు. లాలాపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కుటుంబానికి అండగా ఉండేందుకు...
సంధ్యారాణి డిగ్రీ పూర్తి చేశాక ఆర్థిక పరిస్థితుల రీత్యా కుటుంబానికి అండగా ఉండేందుకు ఏడాది క్రితం ఓ షాపులో పనిలో చేరింది. మరోవైపు కార్తీక్ ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడేవాడు. అతడి ప్రేమను ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారి గురువారం నడిరోడ్డులో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆనక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సంధ్యారాణి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
పెళ్లికి నిరాకరించిందనే కోపంతో...
సంధ్యారాణి హత్య కేసులో నిందితుడు కార్తీక్పై పోలీసులు 307, 354 సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామని, త్వరలోనే చార్జిషీటు దాఖలు చేస్తామని డీసీపీ సుమతి వివరించారు. కార్తీక్ అవారాగా తిరుగుతుండడంతో సంధ్య అతనిని దూరం పెట్టిందని డీసీపీ వివరించారు. ఈ కారణంగానే సంధ్య అతనితో పెళ్లికి నిరాకరించిందని చెప్పారు. సంధ్య కాదనడంతోకార్తీక్ తీవ్ర ఆగ్రహానికి గురై ఓ పథకం ప్రకారం సంధ్యపై పెట్రోలు పోసి నిప్పు పెట్డాడని డీసీపీ వివరించారు.
కుమార్తె మృతిని జీర్ణించుకోలేక.
మరోవైపు సంధ్యారాణి ఆకస్మిక మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుమార్తె మరణాన్ని సంధ్య తల్లి జీర్ణించుకోలేకపోతోంది. కదిలిస్తే చాలు ఆమె కన్నీరుమున్నీరవుతోంది. కార్తీక్ను కఠినంగా శిక్షించాలని, తన కళ్లముందే వాడిని తగలబెట్టాలని కోరుతోంది. ఆస్పత్రిలో కూడా సంధ్యకు సరిగా చికిత్స చేయలేదని ఆమె ఆరోపించింది. మరోవైపు.. ప్రేమోన్మాది కార్తీక్పై కఠిన చర్యలు తీసుకోవాలని, సంధ్యారాణి కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.