ఉమ్మడి కరీంనగర్లో టీడీపీకి బీటలు.. కాంగ్రెస్ గూటికి మరో నేత
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ నుంచి వలసల పరంపరకు అడ్డుకట్ట వేసినా ఫలితం లేకుండా పోతుందా? అధిష్టానం ప్రయత్నాలు ఫలించడం లేదా..? 'సైకిల్' ప్రస్థానం ఇక ముగిసినట్లేనా? రాష్ట్ర స్థాయిలో సీనియర్ నేతగా రేవంత్ రెడ్డి ఏం చక్కా 'చేయి' అందుకుంటే.. చంద్రబాబుకు తొలి నుంచి సన్నిహితుడు కావడంతోపాటు వ్యవస్థాపక నేతల్లో ఒక నేత 'కాంగ్రెస్ పార్టీ'కి గూటికి చేరుకున్నారు.
ఇదే పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైకిల్ ప్రాభవం' ఇక కనుమరుగు కానుందా? అంటే. జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవలే మూడు జిల్లాల అధ్యక్షులు, పది నియోజకవర్గాల ఇన్చార్జిలు టీడీపీకి టాటా చెప్పి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో చేరారు.
తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి 'చెయ్యెత్తి' జై కొట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు ఇరుపార్టీల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కీలక నేతల్లో ఒకరైన సదరు వ్యక్తి.. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు పార్టీకి అండగా ఉన్నారు.
భవిష్యత్పై సందేహాలతో మూడున్నర దశాబ్దాలుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకోనున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 26 తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుండటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
తెలంగాణ టీడీపీలో అయోమయం
ఉమ్మడి జిల్లాలో గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షులుగా పని చేసిన చింతకుంట విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి, చొప్పదండి ఇన్చార్జి మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కశ్యప్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అన్నమనేని నర్సింగరావు, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పేర్యాల రవీందర్రావు, మంథని అసెంబ్లీ స్థానం ఇన్చార్జి కర్రు నాగయ్య టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు అందులో 10 నియోజకవర్గాలకు ఇన్చార్జిలు కరువయ్యారు.
Recommended Video
మల్లు రవి నివాసంలో కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు
ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఒకరు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మంతనాలతో పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మాజీ ఎంపీ మల్లు రవి గృహంలో చర్చలు కూడా జరిపారు. ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ నేతృత్వంలో పార్టీలో చేరేందుకు అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2004 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో, కరీంనగర్ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటారనుకున్న సదరు నేత సైతం వలసబాట పట్టడం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు తమ్ముళ్లలో డోలాయమానం
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికే జిల్లాకు చెందిన టీడీనీ ప్రథమ శ్రేణి నేతలు తలోదారి చూసుకున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నేతలు సైతం తమ భవిష్యత్ కోసం బాటలు వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో కాకపోతే ఇకపార్టీ మారడం ఇబ్బందిగా పరిణమించే అవకాశాలు ఉండడంతో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నారు. టీడీపీలోనే ఉంటే వచ్చే రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానాలు తలెత్తుతుండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు డోలాయమానంలో పడుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఉమ్మడి జిల్లాలో తిరుగులేని శక్తిగా వెలుగొందిన టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాబు వేగుల నిఘా..
ప్రస్తుతం తెలంగాణలో అస్తుబిస్తుగా ఉన్న నేపథ్యంలో వలసలు ఇలాగే జరిగితే పార్టీలో మిగిలేది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద టీడీపీకి గడ్డు రోజులు వచ్చాయని సొంత పార్టీలోనే బాహాటంగా చర్చించుకోవడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబు దూతలు ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ద్వితీయశ్రేణి నేతలకు పదవులు కట్టబెట్టేందుకు పలువురి పేర్లను పరిశీలించారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్లో సీనియర్ నేతలంతా వలసబాట పట్టడంతో పార్టీకి మూడు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిల కోసం అధిష్టానం వెదకడం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోంది. ఇక కరీంనగర్ జిల్లాలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ వంటి సీనియర్ నేతలు ఒకరిద్దరూ మాత్రమే మిగిలి ఉంటారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.