హైదరాబాద్ విధ్వంసానికి ఐసిస్ కుట్ర: సీక్రెట్ ఇంటర్నెట్ వరల్డ్
హైదరాబాద్: ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు హైదరాబాదులో విధ్వంసానికి పన్నిన కుట్రకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారి తెలివికి ప్రతి ఒక్కరి మైండూ బ్లాంక్ కావాల్సిందే. నిఘాకు చిక్కకుండా వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. దొంగ పేర్లతో సిమ్ కార్డులు తీసుకున్నారు.
మామూలు జీవితాలు గడుపుతున్నట్లుగానే నమ్మించి భారీ కుట్రకు పథక రచన చేసి అమలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సాంకేతికంగా సోషల్మీడియాలో దొరకకుండా వారిదే అయిన అంధకార ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. కొత్త ఆపరేటింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చి దుబాయ్, సిరియాలో ఉన్న ఐఎస్కు చెందిన కీలకవ్యక్తులతో సంభాషణలు సాగించారు.
ఎవరూ పెద్దగా ఉపయోగించని ఆపరేటింగ్ సిస్టమ్స్ను ఇన్స్టాల్ చేసుకున్నారు. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్రపన్ని పట్టుబడ్డ ఇబ్రహీం సహా ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను విచారించినప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఐఎస్ కీలక నేతలతో సంప్రదింపులు, పేలుళ్ల కుట్రల సమాచారం నిఘా విభాగాలకు చిక్కకుండా ఉండేందుకు విండోస్ ఓఎస్ కాకుండా టెయిల్స్ అనే నూతన ఆపరేటింగ్ సిస్టమ్స్ను ఇబ్రహీం తన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. అంతేకాకుండా టోర్స్ అనే మరో నూతన ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మరో కంప్యూటర్లో ఇబ్రహీం ఇన్స్టాల్ చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
వీటి ఆపరేషన్ మెయింటెన్స్ కోసం చిన్నస్థాయి సర్వర్ను కూడా ఇబ్రహీం ఏర్పాటు చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు కనుగొన్నట్లు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి. సర్వర్ను రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇలా ఏదో దేశంలో కొనుగోలుచేసి అక్కడి వివరాలతోనే ఇక్కడ ఆపరేటింగ్ చేస్తున్నట్టు ఎన్ఐఏ టెక్నికల్ టీమ్స్ గుర్తించాయి. ఇలా చేయడం వల్ల దేశంలోని నిఘావర్గాలు ట్రాక్ చేయడం అంత సులభంగా సాధ్యం కాదని అంటున్నారు.
ఐఎస్ కుట్రలు అమలు చేసేందుకు ఇబ్రహీం యాజ్దానీ నకిలీ పేర్ల మీద 32 సిమ్కార్డులు కొనుగోలు చేసి వాడినట్లు తెలుస్తోంది. వీటిలో 9 ఎయిర్సెల్ సిమ్కార్డులను చార్మినార్ వద్ద గల ఐఎస్ సానుభూతిపరుని దుకాణంలో, పేలుడు పదార్థాల బరువు తెలుసుకొనేందుకు ప్రత్యేకంగా చిన్నస్థాయి వెయింగ్మిషన్ను బీబీబజార్లోని ఓ దుకాణంలో కొన్నట్టు బయటపడింది.
టుటానోటా డాట్ కామ్ ద్వారా ఎన్క్రిప్ట్ చేసిన మెయిల్స్ నుంచి సిరియాలోని హ్యాండ్లర్లకు సమాచారం పంపించినట్టు ఎన్ఐఏ బృందాలు గుర్తించాయి. కీలక విషయాలపై ఈ ఎన్క్రిప్ట్ మెయిల్ ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు సాగించినట్టు తెలుస్తోంది.
ఐఎస్కు అనుబంధంగా దేశవ్యాప్తంగా పలు మాడ్యూల్ను సృష్టించిన షఫీ ఆర్మర్ హైదరాబాద్ మాడ్యూల్కు జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్ అనే పేరు పెట్టాడని వెల్లడైంది. ఇబ్రహీం యాజ్దానీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు.