గ్లోబల్ సమ్మిట్కు హైలైట్ 'రెహమాన్ కాన్సర్ట్': ఇవాంకా ఆసక్తి.. మోడీ, కేసీఆర్ ఆతిథ్యం..
నవంబర్ 28-నవంబర్ 30వ తేదీల్లో జరగనున్న ఈ సమ్మిట్ సన్నాహ వేడుకల్లో భాగంగా మ్యూజిక్ మేస్ట్రో ఏ.ఆర్.రెహమాన్తో మ్యూజిక్ కాన్సర్ట్(కచేరీ) నిర్వహించనున్నారు.
హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్ సమీపిస్తుండటంతో సదస్సుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 1500మంది ప్రముఖులు సదస్సుకు హాజరుకానున్నారు.
ఇవాంకా రాక: ఇంత జరుగుతోందా?, తేల్చుకోలేకపోతున్న హోంశాఖ, ఇవీ ఏర్పాట్లు..
నవంబర్ 28-నవంబర్ 30వ తేదీల్లో జరగనున్న ఈ సమ్మిట్ సన్నాహ వేడుకల్లో భాగంగా నవంబర్ 26న మ్యూజిక్ మేస్ట్రో ఏ.ఆర్.రెహమాన్తో మ్యూజిక్ కాన్సర్ట్(కచేరీ) నిర్వహించనున్నారు. ఐదేళ్ల తర్వాత రెహమాన్ ఇండియాలో ఇవ్వబోతున్న తొలి కాన్సర్ట్ ఇదే కావడం విశేషం. తన కెరీర్ మొదలుపెట్టిన రోజా (1992) సినిమా నుంచి 25ఏళ్ల తన సంగీత ప్రస్థానంలోని పాటలతో రెహమాన్ కాన్సర్ట్లో ఆకట్టుకోనున్నారు.
కాగా, ఈ మ్యూజికల్ కాన్సర్ట్కు హాజరవాలని ఇవాంకా ఆసక్తి కనబరుస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెహమాన్ సిబ్బంది మాత్రం ఆ విషయాన్ని ధ్రువీకరించలేదు. తమకలాంటి సమాచారమేది లేదని చెప్పారు. దాదాపు 30వేల మంది అభిమానులు ఈ కాన్సర్ట్ కు వస్తారని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచే గాక దేశవ్యాప్తంగా రెహమాన్ అభిమానులంతా ఈ కాన్సర్ట్ లో పాల్గొనే అవకాశముంది.
ఇదిలా ఉంటే, హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. ఇవాంకా చార్మినార్, లాడ్ బజార్, చౌహముల్లా ప్యాలెస్ను సందర్శిస్తారని తెలుస్తోంది. చౌహముల్లా ప్యాలెస్ లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఇవాంకాకు విందు ఆతిథ్యం ఇవ్వనున్నట్టు సమాచారం. ఆ మరుసటి రోజు నవంబర్ 29న తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ ఫోర్ట్లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సుకు హాజరైన ప్రముఖులకు విందు ఆతిథ్యం ఇవ్వనున్నారు.