ఫీజు రీఎంబర్స్మెంట్ దుర్వినియోగం చేస్తే చర్యలు: అనాథ పిల్లలకు ఎస్సీ ప్రయోజనాలు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4,687 కోట్ల మేర బోధనా రుసుములు చెల్లించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4,687 కోట్ల మేర బోధనా రుసుములు చెల్లించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బోధనా రుసుముల(ఫీజు రీఎంబర్స్మెంట్)పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం బకాయి పడిన రూ.1880 కోట్ల బోధనా రుసుములు కూడా తమ ప్రభుత్వం చెల్లించిందని సీఎం చెప్పారు. బోధనా రుసుములు చెల్లింపులో గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్నే యథావిధిగా అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏటా బోధనా రుసుముల బకాయిలు పెడుతూ వచ్చారని... ఈ అంశంపై ఆ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు.
బోధనా రుసుముల పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న కళాశాలలపై కఠినచర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. బోధనా రుసుముల అంశం సున్నితమైనది.. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినదని పేర్కొన్నారు. డబ్బులు ఇస్తున్నప్పుడు విద్యార్థులకు ఉపయోగపడాలని అన్నారు. మంచి విద్యాసంస్థలను ప్రోత్సహిస్తామని తెలిపారు.
2011-12 టోటల్ డిమాండ్ రూ.2906 కోట్లు అవసరమైతే రూ.1492 కోట్లు విడుదల చేశామని వివరించారు. 2012-13లో టోటల్ డిమాండ్ రూ.3613 కోట్లు అవసరమైతే రూ.2063 కోట్లు విడుదల చేశామన్నారు. 70 శాతం అటెండెన్స్ ఉన్నవారికే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నామన్నారు.
అకాడమిక్ ఇయర్ పూర్తయితే తప్ప 70 శాతం అటెండెన్స్ పూర్తైన విషయం తెలియదన్నారు. గతంలో ఫీజు బకాయిలే లేనట్టు ఇవాళే బకాయిలు ఉన్నట్టు మాట్లాడటం సరికాదన్నారు. మార్చి 31 వరకు బకాయిలను చెల్లించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సభ్యులు అక్బరుద్దీన్ అడిగిన ప్రతిప్రశ్నకు రాతపూర్వకంగా పంపిస్తామని తెలిపారు.
డబ్బులు ఇస్తున్నపుడు విద్యార్థికి ఉపయోగం కావాలి కాని సంస్థకు కాదన్నారు. స్టాండర్డ్లను బట్టి కాలేజీల్లో సీట్లు ఇస్తారు. ఎవరైనా పేద విద్యార్థి అలాంటి కాలేజీల్లో చదువుదామంటే వారికి డబ్బులు ఎక్కువగా ఇస్తున్నామని వివరించారు. ఇది తాను చెబుతున్నది కాదని వైఎస్ఆర్ కాలంలో నుంచి వస్తున్నదని వివరించారు.
దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో అన్యాయం జరగనీయమని స్పష్టం చేశారు. బకాయిల పరంపర కొనసాగుతూనే ఉంటుందని, మార్చి 31 వరకు చెల్లిస్తామన్నారు. ఆర్థికశాఖ ఎప్పటికప్పడు క్లియర్ చేస్తుందని, ఏ విద్యార్థి కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందొద్దన్నారు. ఏ విద్యార్థికీ అన్యాయం జరగదని చెప్పారు.
అనాథ పిల్లలకు ఎస్సీ ప్రయోజనాలు
రాష్ట్రంలోని అనాథ పిల్లలందరికీ ఎస్సీలకు చేకూరే ప్రయోజనాలన్ని చేకూరుస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ప్రక్రియ అమల్లోకి వస్తుందని చెప్పారు.
పెద్ద నోట్ల రద్దుకు మద్దతు
నోట్ల రద్దుకు తమ ప్రభుత్వం మద్దతిచ్చిందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అవును నిజంగానే అక్బరుద్దీన్ అన్నట్టు తాము కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నోట్ల రద్దు విధానానికి మద్దతిచ్చామని తెలిపారు. ఇది దేశానికి మంచి మద్దతునిస్తుందని పేర్కొన్నారు. డీమానిటైజేషన్ వల్ల కష్టాలు నామ మాత్రమేనని పేర్కొన్నారు. దీని ఫలితాలు భవిష్యత్లో అద్బుతంగా ఉంటాయని వివరించారు.
భట్టి విక్రమార్క-కాంగ్రెస్ వాకౌట్
ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో పలు అంశాలను మరిచిపోయిందని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క అన్నారు. కాగా, సీఎం వివరణ ఇచ్చినందున దీనిపై చర్చ అవసరం లేదని మంత్రి హరీశ్ రావు.. భట్టికి స్పష్టం చేశారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. అక్భరుద్దీన్ లేచి ఈ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్లు ఉందని, ప్రొటెస్ట్ చేయవద్దని సూచించారు.
ఆ తర్వాత మరోసారి భట్టి మాట్లాడేందుకు ప్రయత్నించగా మళ్లీ స్పీకర్ అడ్డుచెప్పారు. దీంతో కాసేపటికే శాసనసభ నుంచి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. ఇలా చేయడం శోచనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీల వల్లే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని అన్నారు.