రోడ్డుపై సామాన్యుడిలా కేటీఆర్: సిగ్నల్ పడగానే కారు దిగి, వైష్ణవికి సెల్ఫీ
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ఓ సాధారణ పౌరుడిలా వ్యవహరించారు. కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే తన వాహనశ్రేణిని నిలిపివేశారు.
కేటీఆర్ను చూసి పలకరించిన టెక్కీ వైష్ణవి
ఆ సమయంలో ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న ఓ సాఫ్టువేర్ ఉద్యోగి వైష్ణవిని మంత్రి కేటీఆర్ను చూసి పలకరించారు. కేటీఆర్ వెంటనే కారు దిగి ఆమెను పలకరించారు. తనతో సెల్ఫీ దిగాలని ఆమె విజ్ఞప్తి చేసారు. ఆమె కోరికను మంత్రి మన్నించారు.
కేటీఆర్ వాహనం దిగి సెల్ఫీ ఇచ్చారు
కేటీఆర్ వాహనం నుంచి కిందకు దిగి ఆమెతో సెల్ఫీ దిగారు. ఆమెతో పాటు అక్కడ ఉన్న పలువురు యువకులు మంత్రితో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు. దీంతో పలువురితో ఆయన సెల్ఫీ దిగారు. మంత్రి కేటీఆర్ను కలవడమే కాకుండా ఆయనతో సెల్ఫీ దిగిన వైష్ణవి.. అది నమ్మలేక ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సాధారణ పౌరుడిలా.. ప్రశంసలు
మంత్రి కేటీఆర్ సాధారణ పౌరుడిలా వ్యవహరించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్ స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు. పైగా మంత్రి. అయినప్పటికీ అధికార దర్పం ప్రదర్శించకుండా మామూలు వ్యక్తిలా వ్యవహరించడాన్ని ప్రశంసిస్తున్నారు.
హామీ ఇచ్చాం
ఇదిలా ఉండగా, ప్రగతి నివేదన సభ విజయవంతమైనందుకు పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు మంత్రి కేటీఆర్ను ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా పలువురు మంగళవారం ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. మరోవైపు, కేటీఆర్ హైకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు తాము ప్రగతి నివేదన సభ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.