భారతి మరణించినప్పుడు చెప్పారు: కెసిఆర్పై మందకృష్ణ
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దొరలకు ఒక న్యాయం, దళితులకు మరో న్యాయమా? అని ఎమ్మార్పీయెస్ వ్యవస్థాపక నేత మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే 20 కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తారా? అని అడిగారు.
తెలంగాణ ఉద్యమంలో ట్యాంక్బండ్ మీద విగ్రహాలు ధ్వంసం చేయలేదా? ఆందోళనలు చేపట్టలేదా? అని కూడా ఆయన ప్రశ్నించారు ఎస్సీ రిజర్వే షన్ల వర్గీకరణ కోసం శాంతియుతంగా తాము ఆందో ళనలు చేపడితే అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు.

మందకృష్ణను అందుకు అరెస్టు చేశారు..
ఈ నెల 10న సికింద్రాబాద్లో భారతి సంస్మరణ సభ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కొద్దిపాటి హింసాత్మక సంఘటనలు జరిగాయి. దాంతో పోలీసులు మందకృష్ణతో పాటు కొందరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. బుధవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

అందుకే అరెస్టులంటూ..
ఎస్సీరిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఎంత అణచివేయాలని చూస్తే ఉద్యమాన్ని అంత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. జనవరి 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో ఎక్కడ అనుమతిస్తే అక్కడే దీక్షలు చేపడుతామని చెప్పారు. దీక్షలను అడ్డుకోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.

అప్పుడు అండగా నిలిచాం..
తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఎమ్మార్పీఎస్ అండగా నిలిచిందని, తెలంగాణకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ టీఆర్ఎస్కు లేఖ అందజేసిన విషయాన్ని మంద కృష్ణ చెప్పారు.

జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి..
జైలు నుంచి మంద కృష్ణ విడుదలవుతున్న విషయం తెలుసుకుని వందలాది మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు హైదరాబాదులోని చంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. జైలు పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని పోలీసులు కార్యకర్తలకు సూచించడంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది కార్యకర్తలు జైలు ద్వారం వద్దకు దూసుకువెళ్లడానికి ప్రయత్నించారు. దాంతో కొంత తోపులాట చోటు చేసుకుంది. జైలు నుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆయన చెయ్యి ఎత్తి కార్యకర్తలకు అభివాదం చేశారు.

దానివల్లనే భారతి మరణించింది..
ఎమ్మార్పీఎస్ కార్య కర్త భారతి మృతికి పోలీసుల దురుసు ప్రవర్తనే కారణమని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. భారతి అంత్యక్రియలు జరగకముందే 48 గంటల్లో అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపిస్తానని శాసనసభలో కేసీఆర్ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 40 రోజులు గడిచినా ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. దీంతో డిసెంబర్ 17న ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో రాత్రి 12 గంటలకు నిరసన ర్యాలీ చేపట్టామని చెప్పారు.












Click it and Unblock the Notifications