నయీం ఎన్కౌంటర్పై కవిత, సిబిఐకి అప్పగింతకి ఎందుకివ్వాలంటే.. అలీ
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్ను రాజకీయం చేయవద్దని నిజామాబాద్ ఎంపీ, తెరాస నాయకురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజుల క్రితం నయీంను మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.
కొత్త జిల్లాలపై కేబినెట్ కమిటి భేటీ
పరిపాలన సౌలభ్యం కోసం చిన్న చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తున్నమని కవిత అన్నారు. కొత్త జిల్లాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.
పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సబ్ కమిటీకి తెలిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ తోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నయీం కేసు సీబీఐకి అప్పగించాలి
గ్యాంగ్ స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అయిదు రాష్ట్రాలలో నయీంతో సంబంధాలు ఉన్న వారిని ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) విచారించగలదా అని నిలదీశారు. సీనియర్ అధికారులను జనియర్ అధికారి ఎలా ప్రశ్నిస్తారన్నారు. నయీం డైరీలోని పేర్లు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలన్నారు.