స్టార్టప్లలో 70 శాతం ఫెయిల్, సహజమే: ఇన్ఫోసిస్ కో ఫౌండర్
బెంగళూరు: ఇన్ఫోసిస్ కో ఫౌండర్, మాజీ సీఐఐ అధ్యక్షులు క్రిస్ గోపాలకృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం స్టార్టప్స్ ఫెయిల్ అయ్యాయని, అందులో అయిదు నుంచి పది శాతం మాత్రమే ఎదిగాయని ఆయన వ్యాఖ్యానించారు.
పెట్టిన స్టార్టప్స్లలో 20 శాతం మాత్రం ఉన్నాయని, కానీ పెరుగుదల కనిపించడం లేదన్నారు. అవి చిన్న కంపెనీలుగానే ఉండిపోయాయని చెప్పారు. ఐదు నుంచి పది శాతం కంపెనీలు మాత్రం ఎదిగాయని వ్యాఖ్యానించారు.
12వ ఇన్నోవేషన్ సమ్మిట్ 2016లో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. వంద కంపెనీల్లో కొన్ని మాత్రమే నిలదొక్కుకుంటున్నాయని చెప్పడం ప్రమాదకర పరిస్థితి ఉందని చెప్పడం కాదని, అభివృద్ధి పరిణామ క్రమంలో ఇవి సహజంగా జరిగేవేనని తెలిపారు.
విఫలమైన కంపెనీల విషయంలో ఎందుకు అలా జరిగిందో పాఠాలు నేర్చుకొని, అడుగు ముందుకు వేయాల్సిన అవసరముందని చెప్పారు.
నాలుగైదేళ్ల క్రితం స్టార్టప్లుగా ఉన్న ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటివి ఇప్పుడు ఎదిగాయన్నారు. పేటీఎం వంటి వాటిని కూడా చూస్తున్నామన్నారు. కొద్ది ఏళ్ల తర్వాత కొత్త కంపెనీల సీఈవోల గురించి మాట్లాడుకుంటామన్నారు. రవాణా, ఆతిథ్యం, లాజిస్టిక్స్ రంగాలలో కంపెనీలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు.