నిజాం కాలేజీ విద్యార్థుల ఆందోళన: భారీగా ట్రాఫిక్ జామ్, ఉద్రిక్తత
హైదరాబాద్: నిజాం కాలేజీ విద్యార్థులు సోమవారం బషీర్బాగ్ చౌరస్తాలో ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాలేజీ ప్రిన్సిపాల్కు వ్యతిరకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.
ఒక్కసారిగా విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. అయితే, అందుకు విద్యార్థులు అంగీకరించలేదు.
హాస్టల్ సదుపాయంపై స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు రోడ్డుపై పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
కాలేజీలో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించడంపై విద్యార్థులు మండిపడ్డారు. హాస్టల్ వసతిని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వసతి లేకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
Students of #Nizam college(Hyd) protesting inside the college campus for demanding hostel accommodation for UG students the college given permission for only https://t.co/a1tmrkAbes will burden for the poor students please provide hostel for them.@KTRTRS @TSNSUI pic.twitter.com/rEQ89dms1X
— BaluCS (@YerramBalraj) October 31, 2022
విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ప్రిన్సిపాల్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థులు వినతి పత్రం ఇస్తే నిర్ణయం తీసుకుంటామని ప్రిన్సిపాల్ హామి ఇచ్చారు. అయితే, హాస్టల్ వసతి కల్పనపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనను కొనసాగించారు. దీంతో పోలీసులు అక్కడికి భారీగా చేరుకోవడం కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత విద్యార్థులు తమ ఆందోళనలను కాలేజీ లోపల కొనసాగించారు.