'మెట్రో’కు ముహూర్తం రెడీ: బట్ నో పార్కింగ్ ప్లేస్.. కాలనీ బస్సులపై ఆర్టీసీ మీనమేషాలు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద మెట్రో రైలుగా ప్రసిద్దికెక్కుతున్నా లోటుపాట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
హైదరాబాద్: భాగ్యనగరానికి... ఆ మాటకొస్తే తెలంగాణకే తల మానికంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు మరో 13 రోజుల్లో ప్రజలకు సేవలందించేందుకు సిద్దమవుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు జీఎంఆర్, హైదరాబాద్ మెట్రో రైలు కార్పొరేషన్ ప్రారంభ పనుల్లో వేగం పెంచాయి. త్వరగా మెట్రో రైలు ఎక్కాలని సగటు నగర వాసిలో తహతహ ఉంటుంది.. కానీ ఒక నిమిషం ఆగాలండోయ్..
Recommended Video
మెట్రోరైలెక్కాలని ఆతృత ప్రతి ఒక్కరికీ ఉండవచ్చు. దానిపై ఎవరికీ అభ్యంతరం లేదు కానీ కానీ ఆయా రైల్వే స్టేషన్లకు పొరపాటున కూడా సొంత వాహనం మాత్రం తీసుళ్లకండి. ఎందుకంటే.. ఏ స్టేషన్లోనూ ప్రత్యేకించి పార్కింగ్ సదుపాయం లేదు. మెట్రో స్టేషన్ల వద్ద అంతర్జాతీయ స్థాయి హంగులతో సకల ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. పార్కింగ్ వసతి కల్పించే అంశం మాత్రం పక్కనబెట్టారు.
24 స్టేషన్లలో నో పార్కింగ్ ప్లేస్
మియాపూర్ నుంచి నాగోల్ మధ్య 30 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని ఈనెల 28వ తేదీన ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ మార్గంలోని 24 స్టేషన్లలో ఎక్కడా పార్కింగ్ వసతి లేదు. దీంతో సుదూర ప్రాంతాల్లోని వారు మెట్రో రైలు ఎక్కాలంటే.. ఆటోలు, బస్సులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. వాస్తవంగా మెట్రో ప్రాజెక్టులో భాగంగా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలోనే సంకల్పించింది.
15 స్టేషన్లకు మెట్రో రైలు పార్కింగ్ ఏర్పాటు చేయాలి
63 మెట్రోస్టేషన్లలోని 17 స్టేషన్ల వద్ద పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు చేయాలని సుమారు 57 ఎకరాలను కేటాయించింది. వీటితో పాటు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సొంత నిధులతో 15 మెట్రోస్టేషన్ల వద్ద అవసరమైన పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, పనులు మొదలైన గత ఐదేళ్లలో పార్కింగ్ సౌకర్యం మినహా అన్ని పనులు చేస్తున్నారు. ఈ విషయమ్మీద అధికారులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. మెట్రో స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దామన్నారు. స్టేషన్ల వద్ద ఆటో బేలను నిర్మిస్తున్నామని చెబుతున్నారు. ప్రైవేట్ వాహనాల కోసం పార్కింగ్ స్థలాన్ని మున్ముందు ఏర్పాటు చేస్తామని సెలవిస్తున్నారు.
బస్ బేల సంగతే విస్మరించిన మెట్రో యాజమాన్యం
మెట్రో రైలు యాజమాన్యం రైల్వే స్టేషన్ల వద్ద ఆర్టీసీ బస్బేల కోసం పూర్తిస్థాయిలో స్థలాలను ఇంకా కేటాయించనేలేదు. ఆర్టీసీ బస్సులో వెళ్లే ప్రయాణికులు మెట్రోస్టేషన్లకు చేరుకోవాలంటే కొంత దూరం నడవాల్సిందేనని సాక్షాత్తు ఆర్టీసీ అధికారులే చెప్తున్నారు. ఇప్పటికైతే ఆరు మెట్రోస్టేషన్ల సమీపంలో బస్బేలు అందుబాటులో ఉన్నాయి. మరో 18 మెట్రో స్టేషన్ ప్రాంతాల్లో 50 నుంచి 300 మీటర్ల దూరంలో బస్బేలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మెట్రోపై టీఎస్ఆర్టీసీ మొద్దు నిద్ర ఇలా
తార్నాక, మెట్టుగూడ, ఎన్జీఆర్ఐ, ప్యారడైజ్, సికింద్రాబాద్, ఈఎస్ఐ, బేగంపేట, మైత్రివనం, ఎర్రగడ్డ మెట్రోస్టేషన్లకు సమీపంలో బస్బేలకు స్థలాలు కేటాయించాలని మెట్రో అధికారులను ఆర్టీసీ కోరుతోంది. అధికార యంత్రాంగం ఎంత మొద్దు నిద్ర నటిస్తున్నదో మెట్రో రైలు ప్రాజెక్టు అమలుపై టీఎస్ఆర్టీసీ అధికారుల పనితీరును బట్టే తెలుస్తోంది. బస్ బేల ఏర్పాటుతోపాటు మెట్రో రైలు ప్రారంభానికి రంగం సిద్ధమవుతున్నా.. దానికి అనుబంధంగా సర్వీసులు నడిపే విషయమై టీఎస్ఆర్టీసీ ఒక్క అడుగు కూడా ముందుకేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అవగతమవుతూనే ఉన్నది.
తాజాగా పరిస్థితిపై అధ్యయనానికి బెంగళూరుకు అధికారులు
మెట్రో రైలు స్టేషన్లకు సమీప కాలనీల నుంచి మినీబస్సులు తిప్పాలని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయించినా నేటికీ కొనలేదు. పైగా ఆర్టీసీ అధికారులు బెంగళూరు మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు ప్రయాణికులను ఎలా తరలిస్తున్నారో పరిశీలించి రావడానికి ఇప్పుడు రెండు రోజుల పర్యటన పేరుతో బెంగళూరుకు వెళ్లడం గమనార్హం. బెంగళూరులో అధికారులు పర్యటించి వచ్చిన తర్వాతే బస్ బేల ఏర్పాటుపై స్పష్టత వస్తుందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.
తొలి దశలో 100 మినీ బస్సులు నడుపాలని ఆర్టీసీ నిర్ణయం
ప్రస్తుతం మెట్రో రైలులో రోజూ నాలుగు లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. మిగిలిన మార్గాల్లోనూ మెట్రో ప్రారంభమైతే దాదాపు 15 లక్షల మంది దీనిలో ప్రయాణిస్తారని చెబుతున్నారు. ప్రధాన రూట్లలోనే మెట్రో తిరుగుతుంది. మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికులను కాలనీలకు తిప్పితే ప్రయాణికులకు సౌకర్యంతోపాటు ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. బెంగళూరు ఆర్టీసీ.. కాలనీలకు పెద్ద బస్సుల్లోనే చక్కగా ప్రయాణికులను చేరవేస్తోంది. హైదరాబాద్లో కాలనీలు చాలాచోట్ల ఇరుకు రోడ్లలో ఉన్నాయి. ఈ కాలనీలకు తిప్పడానికి మొదటి దశలో 100 మినీ బస్సులు కొనాలని చాన్నాళ్ల కిందటే ఆర్టీసీ నిర్ణయించింది. వీటి కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని అధికారులు చెబుతున్నా బస్సులైతే రాలేదు. మినీ బస్సుల నిర్వహణ ఖర్చు తక్కువ.మెట్రో ప్రయాణికుల్లో ఎక్కువ మంది కాలనీల నుంచి వచ్చేవారే కాబట్టి ఆక్యుపెన్సీ సమస్యా ఉండదు. లాభాలు వచ్చే అవకాశం ఉన్నా ఆర్టీసీ వినియోగించుకోవడం లేదని, ప్రయాణికుల కష్టాలు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు అంటున్నారు.
ముఖ్యమైన కాలనీలకు మినీ బస్సులు నడుపుతామన్న మంత్రి మహేందర్ రెడ్డి
ముంబై తరహాలో మెట్రో స్టేషన్ల నుంచి కొన్ని ముఖ్యమైన కాలనీలకు మినీ బస్సులు తిప్పడానికి ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్రెడ్డి చెప్పారు. 230 మినీ బస్సులు కొనాలని నిర్ణయించామని, మెట్రో ప్రారంభ తేదీ ఖరారయ్యిక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామన్నారు. కాలనీలకు మినీబస్సులు తిప్పాలన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్టీసీ ఎండీ రమణరావు చెప్పడం గమనార్హం. బెంగళూరు వెళ్లిన అధికారులు వచ్చాక చర్చించి ప్రణాళిక అమలు చేస్తామన్నారు.