పోలీస్ డ్రోన్ నిఘా: అసాంఘిక శక్తుల కట్టడికి ఫ్లయింగ్ కెమెరా
Recommended Video
కరీంనగర్ :పోలీస్ కమిషనరేట్గా ఏర్పడిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాజధానితో పోటీ పడుతున్నది. కమిషనరేట్ పరిధిలో 10వేల సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర నియంత్రణ కోసం సాగుతున్న పోలీస్శాఖ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. దాని పేరే డ్రోన్. గగన తలంలో విహారిస్తూ ఎక్కడ ఏం జరుగుతుందో అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో చూపిస్తుంది.
పనితీరు ఇలా..
సుమారు లక్షా50వేలతో కొనుగోలు చేసిన ఈ అత్యాధునిక ైఫ్లెయింగ్ కెమెరా, రెండ్రోజుల క్రితం నుంచే శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగమైం ది. కమిషనరేట్ కేంద్రంలోని కార్యాలయంలో కూర్చుని డ్రోన్ను ప్రయోగించవచ్చు. సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. 500 మీటర్ల ఎత్తు వరకు ఎగురుతుంది.
పూర్తిస్థాయి క్లారిటితో ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తుంది. స్మార్ట్ఫోన్కు కూడా అనుసంధానం చేసి మనం ఉన్న చోటే నుంచి డ్రోన్ను వినియోగించి సమాచారం తెలుసుకోవచ్చు. అసాంఘిక శక్తుల ఆట కట్టించడమే కాక నగరంలోని ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు.
నిరంతర నిఘా..
శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే నగరంపై డ్రోన్ కెమెరాతో నిరంతర నిఘా పెడుతున్నారు. బుధవారం నుంచే ఈ ఫ్లయింగ్ కెమెరాను ప్రారంభించారు. మొదటి రోజే మానేరు పరిసర ప్రాంతాల్లో బహిరంగ మద్యం, ప్రేమజంటలు, దారిదోపిడీ లాంటి ఘటనలను గుర్తించారు.
ఉజ్వల పార్కు, జింకల పార్కు, మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంతోమంది పోకిరీలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ అందించిన చిత్రాల ఆధారంగా తొమ్మిది మంది మందుబాబులను అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం మరోసారి డ్యాం శివారు ప్రాంతంలో డ్రోన్ను ప్రయోగించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న పది మంది మందుబాబులను పట్టుకున్నారు.
రాగుల కనుకయ్య, స్వామి, వినయ్, అఖిల్, వెంకటేశ్, నిమ్మ మహేందర్రెడ్డి, నాంపెల్లి ఆదిత్య, మొలుగు భానుచందర్, కాశిపాక ప్రశాంత్, వినిత్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2 కార్లు, మూడు బైక్లను స్వాధీనం చేసుకొని కొత్తపల్లి పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ మర్రిపల్లి రమేశ్ తెలిపారు.