ఢిల్లీకి వెళ్లి తల దించుకొని వచ్చిన సన్నాసి కేసీఆర్.!వరి కొనుగోలు అంశంలో షర్మిళ ఫైర్.!
హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుపై వైయస్సార్ టీపి అద్యక్షురాలు వైయస్ షర్మిళ మరోసారి మండి పడ్డారు. కేంద్రంతో వరి ధాన్యం కొనుగోలు చేయించడంలో సీఎం ఘోరంగా విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజా సంకల్ప పాద యాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన షర్మిళ లోటస్ పాండ్ లో ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే, అమ్ముకోవడం మరో ప్రహసనంగా మారిందని, వరి దాన్యం అమ్మకం అంశంలో రైతు కంటతడిపెడుతున్నాడని షర్మిళ ఆవేదన వ్యక్తం చేసారు.
అయోమయంలో రైతులు..
పండిన పంటను అమ్ముకోగలమా లేదా అనే దిక్కు తోచని స్థితి లో రైతన్న ఉన్నాడని, రైతుల పక్షాన పోరాటం చేయడానికి పాదయాత్రను సైతం పక్కన పెట్టానని షర్మిళ స్పష్టం చేసారు. మద్దతు ధర పై సూర్యాపేట,మెదక్ జిల్లా మార్కెట్ యార్డ్ లను సందర్శించానని, మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. సూర్యాపేట మార్కెట్ యార్డ్ లో ఒకరోజు చార్ట్ చూస్తే ఇద్దరు రైతులకు మాత్రమే 1930 రూపాయల ధర పలికినట్టు నమోదవ్వడం, మిగతా 600 వందల మంది రైతులకు 15 వందల కంటే ఎక్కువ ధర చెల్లించడం ఆందోళన కలిగిస్తోందన్నారు షర్మిళ.
కొనుగోలు కేంద్రాల్లో దారుణమైన పరిస్ధితులు..
అంతే కాకుండా మెదక్ మార్కెట్ యార్డ్ లో 20 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారని, మార్కెట్ యార్డ్ లో కనీసం అధికారులు కూడా లేరని, పంట కొంటారా..ఎంతకు కొంటారు అని చెప్పే నాథుడు కూడా లేడని షర్మిళ స్పష్టం చేసారు. మార్కెట్ లో ధాన్యం వర్షానికి తడిచి, ఎండకు ఎండుతున్నాయని, 20 రోజులుగా ఇదే వ్యవహారం నడుతుస్తున్నా పట్టించుకునే వారు లేరన్నారు షర్మిళ. సీఎం జిల్లా మెదక్ లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుందో అర్థం అవుతుందని షర్మిళ ప్రభుత్వ యంత్రాంగం మీద అసహనం వ్యక్తం చేసారు.
వరి వేస్తే ఉరి అని చెప్పి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు..
ఎనిమిది ఏళ్లలో ఎనిమిది వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని, అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటుంటే ఎవడైనా పట్టించుకుంటున్నారా అని షర్మిళ నిలదీసారు. రైతు 59 ఏళ్లకు చనిపోవాలని సీఎం చంద్రశేఖర్ రావు రైతు నుదిటి మీద మరణ శాసనం రాస్తున్నారని, వ్యవసాయ దారుడికి ఇచ్చే గౌరవం సంగతి పక్కన పెడితే, రైతుకు తెలంగాణలో కనీస విలువే లేదన్నారు షర్మిళ. ప్లీనరీలో రైతు అభినందన తీర్మానం పెట్టడానికి సీఎం చంద్రశేఖర్ రావు సిగ్గుండాలన్నారు షర్మిళ. ఢిల్లీ కి వెళ్లి మొహం దించుకొని వచ్చిన సన్నాసి, వరి వేస్తే ఉరి అని చెప్పి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన సన్నాసి చంద్రశేఖర్ రావు అని షర్మిళ మండిపడ్డారు.
టీఆర్ఎస్ నేతలను చేర్చుకోం..
రైతుల మీద కాంగ్రెస్ పార్టీ కి అవగాహన లేదని, మేలు చేయాలని ఆలోచన లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఎందుకు చేయలేదని షర్మిళ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆరెఎస్ కి అమ్ముడు పోతారని ప్రజలకు తెలుసన్నారు షర్మిళ. కాంగ్రెస్ పార్టీ కి ఉన్న క్రెడిబులిటి ఎంటని, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఒక దొంగను తీసుకొచ్చి పార్టీ అద్యక్షుడిగా పెట్టారని, రేవంత్ గురించి ఆ పార్టీ నేతలకు బాగా తెలుసన్నారు షర్మిళ. కేటిఆర్ ఏమైనా మాట్లాడుతారని, చంద్రశేఖర్ రావు ఒక దొర ఐతే కేటీఆర్ యువరాజులా ఫీలవుతాడని ఆరోపించారు. టీఆరెఎస్ నుంచి నేతలను చేర్చుకురే ఆసక్తి తమకు లేదన్నారు షర్మిళ.