శిరీషది ఆత్మహత్యే, అందుకే ప్రభాకర్ దగ్గరికి వెళ్లాం: ఏ1 శ్రవణ్ మాట ఇది
బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులైన రాజీవ్, శ్రవణ్లను పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులైన రాజీవ్, శ్రవణ్లను పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అంతకు ముందు వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రభాకర్ మృతికి ఏసీపీనే కారణమా?: భార్య, తల్లి ఏమన్నారంటే?
ప్రభాకర్ ఉమ్మడి మిత్రుడు
అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. శిరీషది ఆత్మహత్యేనని శ్రవణ్ తెలిపాడు. కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తనకు, రాజీవ్కు ఉమ్మడి మిత్రుడని శ్రవణ్ తెలిపాడు.
రాజీవ్, శిరీష కోసమే ప్రభాకర్ వద్దకు..
రాజీవ్, శిరీష సమస్య పరిష్కారం కోసమే ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళ్లామని శ్రవణ్ తెలిపాడు. అయితే, తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత శిరీష ఆత్మహత్య చేసుకుందని శ్రవణ్ తెలిపాడు. అయితే, ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలను మాత్రం అతడు వెల్లడించలేదు.
ఏ1 శ్రావణ్, ఏ2 రాజీవ్
శిరీష అనుమానాస్పద మృతి కేసులో శ్రవణ్ ఏ1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. రాజీవ్ ఏ2 నిందితుడిగా ఉన్నాడు. శిరీష మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకోగా, ఆ మరుసటి రోజే ప్రభాకర్ రెడ్డి కుకునూరుపల్లిలో అనుమాస్పాద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హత్యలేనంటే...
అటు శిరీష కుటుంబసభ్యులు, ఇటు ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు కూడా వారిద్దరిదీ ఆత్మహత్యలు కాదని అంటున్నారు. శిరీషను చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని శిరీష తల్లి, భర్త, కూతురు ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే మృతి చెందాడని, ఆయన మృతిపై అనుమానాలున్నాయని ఎస్ఐ తల్లి, భార్య, సోదరులు ఆరోపిస్తున్నారు.