చీపుర్లు పట్టుకోవాల్సి వస్తుంది: శోభారాణి, కెసిఆర్ ఫొటోకు మద్యంతో అభిషేకం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం మహిళా నేత శోభారాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తాగుబోతు కాబట్టే తాగుబోతులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
మంత్రులు చీప్ లిక్కర్ బాటిల్ పట్టుకుని బ్రాండ్ అంబాసిడర్లలా వ్యవహరించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ను ఉపసంహరించుకోకపోతే మేం చీపుర్లు పట్టుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.
చీప్లిక్కర్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1,2 తేదీల్లో చీప్ లిక్కర్కు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభారాణి తెలిపారు.
నీళ్లు కావాలంటే.. మద్యం తాగండనట్లుంది
ప్రజలు నీళ్లు కావాలి మొర్రో అంటే మద్యం తాగండి అన్నట్లుగా టిఆర్ఎస్ సర్కారు తీరు ఉందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి ఎద్దేవా చేశారు. బుధవారం అదిలాబాద్ జిల్లా మందమర్రిలోని కమ్యూనిటీ హల్లో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు.
ఓ వైపు తాగడానికి మంచినీళ్లు లేక జనం అలమటిస్తుంటే నూతన మద్యం, సర్కారు చీప్ లిక్కరు... గుడుంబా కంటే చాలా మంచిదంటూ ప్రభుత్వం ప్రచారం చేయడం హస్యాస్పదమని జ్యోతి ఆరోపించారు.
ప్రజలకు కావాల్సింది మంచినీరే కానీ, మద్యం కాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించి బంగారు తెలంగాణ నిర్మించుకుందామన్న సీఎం కేసీఆర్ చివరకు తెలంగాణను మద్యంలో ముంచెత్తాలని చేస్తున్నారని జ్యోతి విమర్శించారు.
కెసిఆర్ చిత్ర పటానికి మద్యం అభిషేకం
హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సిఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మంగళవారం మద్యం మద్యంతో అభిషేకం చేశారు. అభిషేకం చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేడారపు సుదాకర్, విద్యార్థి నాయకులను సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
ఆదర్శంగా తీర్చిదిద్దాలి: పొన్నం
తెలంగాణ ముఖ్యమంత్రి కొన్ని గ్రామాలను మాత్రమే ఆదర్శంగా తీసుకుంటున్నారని, అలాకాకుండా మొత్తం రాష్ట్రాన్నే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మాజీ ఎంపి, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రైతాంగం పట్ల సిఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.