కలాంకు హైద్రాబాద్తో బంధం: కెసిఆర్, ఏపీలో పుట్టాలని ఎర్రబెల్లి తడబాటు
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దివంగత అబ్దుల్ కలాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిష్టారెడ్డిలకు అసెంబ్లీ నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్మానం ప్రవేశ పెట్టారు.
హైదరాబాద్తో విడదీయరాని అనుబంధం: కెసిఆర్
భాగ్యనగరంతో దివంగత అబ్దుల్ కలాంకు విడదీయరాని అనుబంధం ఉందని, కంచన్ బాగ్లో ఉంటూ విధులు నిర్వర్తించారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. 2002 నుంచి 2007 వరకు ఆయన రాష్ట్రపతిగా నిస్వార్థ సేవలు అందించారన్నారు.
సుఖోయ్ యుద్ధ విమానం నడిపి, జలాంతర్గామిలో ప్రయాణించి ప్రఖ్యాతి గాంచారన్నారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం కలాంకు.. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఇచ్చాయన్నారు. జాతి, కుల, మత బేధాలను తేడా లేకుండా ఆయన విశేష సేవలు అందించారన్నారు.
ఆయన మరణం దేశానికి, ముఖ్యంగా రక్షణ రంగానికి తీరని లోటు అన్నారు. కలాం స్మృతిగా హైదరాబాదు డిఆర్డీఎల్కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. అబ్దుల్ కలాం మరణం దేశానికి తీరని లోటు అన్నారు.
టిడిపికి దక్కిన అదృష్టం: ఎర్రబెల్లి
అబ్దుల్ కలాం మహారుషి అని, ఆయన దేశానికి వన్నె తెచ్చారన్నారు. కలాం మృతితో దేశ ప్రజలు యావత్తు తమ కుటుంబ సభ్యులను కోల్పోయినట్లుగా కలత చెందిందన్నారు. కలాం విషయంలో టిడిపికి ఓ అదృష్టం దక్కిందన్నారు. డీఆర్డీఎల్కు కలాం పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి నిర్ణయమని కొనియాడారు.
రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం పేరును తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయేకు సూచించారని, అది తమ టిడిపికి దక్కిన అదృష్టమన్నారు. అలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాలని ఎర్రబెల్లి తడబడ్డారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సరిచేసుకోమని సూచించగా.. కలాం వంటి వ్యక్తి తెలంగాణలోనే పెట్టాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్రమంటే తన ఉద్దేశ్యం తెలుగు రాష్ట్రాలని చెప్పారు.
కలాం దేశానికి అత్యున్నత సేవ చేశారు: జానా రెడ్డి
కలాం గొప్ప శాస్త్రవేత్తనే కాకుండా, రాష్ట్రపతిగాను దేశానికి అత్యున్నత సేవలు అందించారని జానా రెడ్డి అన్నారు. దేశ రక్షణ రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు.
మహనీయుడు కలాం: కిషన్ రెడ్డి
స్వామి వివేకానంద తర్వాత యువతను విశేషంగా ఆకర్షించిన మహనీయుడు అబ్దుల్ కలాం అని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కలాం చేసిన పరిశోధనల వల్లే దేశం రక్షణ రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరిందన్నారు.
అణుశక్తి పరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాలకు భారత్పై ఉన్న చిన్నచూపు తొలగించారన్నారు. విద్యార్థులంటే కలాంకు ఎంతో అభిమానమని, యువతకు దిశానిర్దేశం చేశారనన్నారు. హైదరాబాద్లోని డీఆర్డీఎల్కు కలాం పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కలాం స్ఫూర్తిగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
దేశానికి దిశానిర్దేశం: పాషాఖాద్రి
కలాం తన జీవితం ద్వారా దేశానికి దిశానిర్దేశం చేశారని మజ్లిస్ పాషాఖాద్రి అన్నారు. కలాంతో హైదరాబాద్కు ఎనలేని సంబంధం ఉందన్నారు. దేశ అత్యున్నత రాష్ట్రపతి హోదాలో పనిచేసి కూడా సాధారణ జీవితం గడపటం ఆయనకే చెల్లిందన్నారు.
కలాం మృతికి సంతాపంగా శాసనసభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంతాపంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై సభ్యులు ప్రసంగించిన అనంతరం అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అంతకుముందు...
శాసన సభ సమావేశాలకు ముందు టిడిపి సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. బిజెపి సభ్యులు పాదయాత్రతో వచ్చారు.
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని బిజెపి శాసనసభాపక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా బిజెపి ఎమ్మెల్యేలు నిజాం కళాశాల నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు.
రైతుల ఆత్మహత్యలు నివారించాలంటూ బిజెపి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. లక్ష్మణ్ మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలపై శాసనసభలో పోరాటం చేస్తామన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం పై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అసెంబ్లీలోకి మట్టిని, ప్లకార్డులు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
తెలంగాణ టిడిపి సభ్యులు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్కు నేతలంతా ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణతో పాటు ఎమ్మెల్యేలంతా ఎన్టీఆర్కు పుష్ఫాంజలి ఘటించారు. పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి హాజరయ్యారు.