బాసిత్కు సలావుద్దీన్ రోల్ మోడల్: ముగ్గురిలో కరుడు కట్టింది ఇతనే
హైదరాబాద్: ఉగ్రవాద సంబంధమైన సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా తన టాబ్లెట్ కంప్యూటర్లోకి డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఇటీవల అరెస్టయిన అనుమానిత ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ దర్యాప్తు అధికారుల వద్ద అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని బాసిత్ అంగీకరించినట్లు హైదరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ఎఫ్ఐఆర్లో తెలిపింది.
పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఆ సమాచారాన్ని తొలగించినట్లు అతను చెప్పాడు. దానికితోడు టాబ్లెట్ కంప్యూటర్ను ఇంట్లోనే వదిలేసి కాశ్మీర్ బాట పట్టాడు. కాశ్మీర్ బయలుదేరుతూ పోలీసులకు చిక్కిన ముగ్గురు హైదరాబాద్ యువకుల్లో బాసిత్ ఒకతను.
సిమీ మాజీ అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ తమ అంకుల్ అని, అతనే తమకు రోల్ మోడల్ అని బాసిత్, ఒమర్ ఫరూక్, మాజ్ హసన్ అంగీకరించినట్లు సిట్ అధికారులు తమ ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఈ ముగ్గురు కూడా ఫ్యామిలీ పంక్షన్లలో, పార్టీల్లో కలుస్తూ ఉండేవారు. ఆ సమయాల్లో తీవ్రంగా చర్చించుకుంటుండేవారు. చివరగా వారు నల్లగొండ కలిశారు.
ముగ్గురిలోనూ బాసిత్ దూకుడుగా వ్యవహరిస్తాడని, ఇతనే మిగతా ఇద్దరికి ధైర్యం నూరిపోశాడని దర్యాప్తు అదికారులు అంటున్నారు. బాసిత్ శరీరం బరువు కేవలం 46 కిలోలే. నిజానికి కాశ్మీర్లోని చలిగాలులను తట్టుకునే శక్తి కూడా వారికి లేదు.
ఆదిలాబాదు వరకు రెండు బైక్లపై వెళ్లిన ముగ్గురు అక్కడి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోలేకపోయారు. దాంతో వాటిని ఓ మెకానిక్ వద్ద వదిలేసి ట్యాక్సీలో నాగపూర్ వెళ్లారు. శారీరకంగా బలంగా లేనప్పటికీ జిహాదీ ఐడియాలజీ వారిని అందుకు పురికొల్పింది.