ఆ అంశంలో ఉత్తమ్ వ్యాఖ్యలను పట్టించుకోని అదిష్టానం..! రాహుల్ మౌనం అందుకేనా..?
హైదరాబాద్ : తెలంగాణలో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటేనే పోలింగ్ లో జరిగిన అవతవకల పట్ల ఆరా తీస్తోంది టీపిసిసి. ఐతే ముందస్తు ఎన్నికల్లో తాము ఎందుకు ఓటమి పాలయ్యామో, అందులో ఈవీయం యంత్రాల లోపం ఎంతవరకు ఉందో విశ్లేషిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గల్లంతయ్యాయని, అందుకు వివిప్యాట్ లలోని రసీదులను లెక్కిస్తే అసలు విషయం నిర్ధారణ జరుగుతుందని టీపిసిసి బలంగా విశ్వసిస్తోంది.
అందుకు చివరి గంటలో తెలంగాణ వ్యాప్తంగా పోలైన ఓట్ల మొత్తాన్ని, ఎన్నికల అదికారులు నిర్థారిస్తున్న ఓట్లను బేరీజు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈవియం యంత్రాల్లో పోలైన ఓట్లు కాకుండా వివిప్యాట్ లలోని స్లిప్ లను లెక్కించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ ను కోరుతోంది. ఐతే ఇదే అంశం పట్ల కాంగ్రెస్ అదిష్టానం మాత్రం ఎలాంటి స్పందన తలియజేయడం లేదని తెలుస్తోంది. అందుకు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
ఓటమి పై టీపిసిసి మేథో మధనం..!పోలింగ్ పడిపోవడానికి కారణాలు విశ్లేషిస్తోన్న కాంగ్రెస్..!
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ ప్రభంజనం ముందు కాంగ్రెస్ చేతులెత్తేసింది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ లో తమకు తిరుగులేదంటూ చెప్పుకుని తిరిగిన నేతల చిరునామా గల్లంతైంది. మరోవైపు ఫలానా ఫలానా నాయకులు ఓడిపోతారంటూ పేర్లతో సహా ముందే చెప్పిన టీఆర్ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు తారక రామారావు తో పాటు ఇతర టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కు అనుకోని ఆయుధం అందించారు. వీరి వ్యాఖ్య ల ఆధారంగా ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలు జరిగాయని నొక్కి చెప్పేందుకు ప్రజాకూటమి నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేసారు.
ఈవియంలలో తప్పులు జరిగాయి..! స్లిప్పులను లెక్కించాల్సిందే అంటున్న ఉత్తమ్..!!
దీంతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణం వివి ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి, ముఖ్యంగా రాహుల్ గాంధీ నుంచి ఉత్తమ్కు ఎలాంటి మద్దతు లభించలేదు. ముందుగా ఉత్తమ్ అనుమానాలను పరిశీలిస్తే ఓటింగ్ సరళికి, ఈవీఎంలు వెల్లడించిన ఫలితాలకు సంబంధమే లేదని ఆయన ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఉంటారని, వీవీప్యాట్ పేపర్ ట్రయల్స్ను లెక్కించాలని ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు.
టీపిసిసి ని పట్టించుకోని అదిష్టానం..! ఒంటరైన ఉత్తమ్..!
సెప్టెంబరు 6 నుంచి అనేక సందర్భాల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై తాము అనుమానాలు వ్యక్తం చేస్తూవచ్చామన్నారు ఉత్తమ్. ఓటరు జాబితా రివిజన్ షెడ్యూల్ను ఎవరూ ఊహించనట్లు కుదించేసి.. ఓటర్ల జాబితా సరి చేయకుండానే ఎన్నికలు నిర్వహించారు. అంతా అయిపోయాక ఎలక్షన్ కమీషన్ క్షమాపణలు చెప్పింది. ఎన్నికల షెడ్యూల్ విషయంలోనూ కేసీఆర్ పేర్కొన్న తేదీలనే కమిషన్ ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో వీవీప్యాట్ పేపర్ ట్రయల్స్ లెక్కించాలని ఉత్తమ్ కోరారు.
ఈవియంలలో తప్పులు దొర్లితే మూడు రాష్ట్రాల్లో ఎలా గెలుస్తాం..! అందుకే రాహుల్ మౌనం..!!
ఎవరెవరు ఓడిపోతారో టీఆర్ఎస్ నేతలు ముందుగానే ఎలా చెప్పగలిగారని ఉత్తమ్ నిలదీస్తున్నారు. ప్రతి ఐదు కాంగ్రెస్ ఓట్లలో నాలుగింటిని టీఆర్ఎస్ కు పడేలా ట్యాంపరింగ్ చేశారంటూ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు ‘ఈవీఎం హఠావో.. ఎలక్షన్ లగావో' అనే నినాదంతో సంచలనం సృష్టించారు ఉత్తమ్. అయితే ఉత్తమ్ చేసిన ఈ వ్యాఖ్యలకు అదిష్టనం నుంచి పెద్ద స్పందన రాలేదు. ముఖ్యంగా రాహుల్ మద్దతివ్వక పోవటానికి ప్రధాన కారణం, ఇటీవల మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ గెలవటమే అనే చర్చ వినిపిస్తోంది. తెలంగాణలో అక్రమాలు జరిగాయని తాము డిమాండ్ చేస్తే తాము గెలిచిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ కూడా ఇదే డిమాండ్ చేసే అవకాశం ఉందని రాహుల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఆరోపణలను రాహుల్ తేలిగ్గా తీసుకున్నారని 10జనపథ్ లో చర్చ జరుగుతోంది.