ట్విస్ట్: ఎస్ఐల ఆత్మహత్యకు కారణమదేనా? కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో వాస్తు మార్పులు
కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహించిన ఇద్దరు కూడ ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే 10 మాసాల వ్యవధిలోనే ఈ ఘటనలు చోటుచేసుకొన్నాయి.అయితే పోలీస్ స్టేషన్ నిర్మాణంలో వాస్తుదోషాలున్నాయని గుర
హైదరాబాద్: కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహించిన ఇద్దరు కూడ ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే 10 మాసాల వ్యవధిలోనే ఈ ఘటనలు చోటుచేసుకొన్నాయి.అయితే పోలీస్ స్టేషన్ నిర్మాణంలో వాస్తుదోషాలున్నాయని గుర్తించిన అధికారులు, వాస్తుదోషాలను సరిచేసే ప్రయత్నాలను ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణంగా మారింది. 2016 ఆగష్టు మాసంలో రామకృష్ణారెడ్డి అనే ఎస్ఐ పోలీస్ స్టేషన్ లోనే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
Recommended Video
అయితే తన ఆత్మహత్యకు పోలీసు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆరోపించారు. అంతేకాదు ఈ మేరకు సూసైడ్ లేఖను కూడ రాశారు.అయితే ఈ విషయమై ఆరోపణలను ఎదుర్కొన్న డిఎస్పీపై వేటేశారు.
ఈ ఘటన జరిగిన 10 మాసాలకు కూడ పరిస్థితిలో మార్పు రాలేదు. పోలీసు ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేశారని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన కుటుంబసభ్యులకు బతికున్న సమయంలో చెప్పేవాడని వారు గుర్తు చేసుకొంటున్నారు. తాజాగా ఈ నెల 14వ, తేదిన ఆయన తన క్వార్టర్ లో రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వాస్తుదోషమే కారణమా?
కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో పది మాసాల వ్యవధిలోనే ఇద్దరు ఎస్ఐలు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. అయితే వాస్తు దోషం కారణంగానే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఉన్నతాధికారులు భావించినట్టున్నారు. వాస్తు లోపాలను సరిచేసే ప్రయత్నాలను ప్రారంభించారు. ఎస్ఐ క్వార్టర్ కు అడ్డుగా ఉన్న గోడను కూలగొట్టారు. పార్కింగ్ స్థలం ప్రాంతంలో కూడ వాస్తుకు విరుద్దగా నిర్మించారని నిపుణులు సూచించారు. దీంతో వాస్తు ప్రకారంగా పార్కింగ్ ప్రాంతంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎస్ఐ ప్రభాకర్ రె్డ్డి స్థానంలో సంతోష్ కుమార్ ను నియమించారు. ఆయన బాధ్యతలను స్వీకరించారు.దీంతో వాస్తు దోషాలను సరిచేస్తున్నారు.
ఉన్నతాధికారులకు కూడ ముప్పే
కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐల ఆత్మహత్యల వ్యవహరం ఉన్నతాధికారులకు కూడ చుట్టుకొంటోంది. ఉన్నతాధికారులు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు రామకృష్ణారెడ్డి లేఖ రాశాడు.ఈ లేఖలో డిఎస్పీ పేరును ప్రస్తావించాడు.దీంతో ఆయనపై వేటు పడింది. అయితే తాజాగా గజ్వేల్ ఏసీపీ గిరిధర్ పై ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. గిరిధర్ ప్రతి నెల రూ.80వేలు మాముళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేశారని వారు ఆరోపించారు.ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు గిరిధర్ కారణమంటూ ఫిర్యాదుచేశారు. దీంతో గిరిధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మామూళ్ళ కోసమేనా?
ఇద్దరు ఎస్ఐలు కూడ మామూళ్ళకోసం ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేసేవారని కుటుంబసభ్యులకు చెప్పారు. అయితే బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసుకు ప్రభాకర్ రెడ్డికి సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. శిరీషపై ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్య కాదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఈ విషయమై ఐజీ స్టీఫెన్ రవీంద్రను కలిసి బుదవారం నాడు వినతి పత్రం సమర్పించారు.
అవినీతిపై మాట్లాడిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి
పోలీస్ శాఖలో చోటుచేసుకొన్న అవినీతిపై కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రస్తావించారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ అధికారులతో సిఎం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉన్నతాధికారుల అవినీతిని అరికట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
వాస్తుదోషం సరిచేస్తే పరిస్థితి మారుతోందా
కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ నిర్మాణంలో చోటుచేసుకొన్న వాస్తులోపాల కారణంగానే ఎస్ఐలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని భావించి వాస్తుదోషాలను సరిచేస్తున్నారు.అయితే ఈ పోలీస్ స్టేషన్ వాస్తుదోషాలను సరిచేస్తే మామూళ్ళ వేధింపులు కానీ, ఇతరత్రా వేధింపులు ఉన్నతాధికారుల నుండి నిలిచిపోతాయా అనే ప్రశ్నలు కూడ ఉత్పన్నమౌతున్నాయి. పోలీస్ శాఖలో మార్పు రానంతవరకు ఈ రకమైన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
జ్యూడీషీయల్ విచారణ జరిపించాలి
కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐల ఆత్మహత్యలకు సంబంధించి జ్యూడీషీయల్ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉపనేత టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే తాము మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని ఆయనహెచ్చరించారు. బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసుతో ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యను లింక్ చేసి కేసును పక్కదోవపట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.