చంద్రబాబుతో మీ కలయిక మాటేమిటి? అందుకే టీడీపీతో: కేసీఆర్ను దులిపేసిన విజయశాంతి
జోగులాంబ: తెరాస అధినేత కేసీఆర్ అబద్దాల ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్లు ఆయన అబద్దాలే చెబుతూ పాలించారని ఆరోపించారు. మొట్టమొదటి అబద్దం దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇవ్వడం అన్నారు. అక్కడి నుంచి అబద్దాలు ప్రారంభమయ్యాయన్నారు.
ఎన్నో పథకాలు అన్నారని, వాటిని సరిగా తీసుకు రాలేదన్నారు. ప్రగతి భవన్లో కూర్చొని పాలించడం సరైనదేనా అని ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఆ తర్వాత ఎదుటి వారి గురించి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి పని చేయడంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడంపై విజయశాంతి ఘాటుగా స్పందించారు.
అడ్డమైన దొంగ చంద్రబాబుతో పొత్తా, తూ.. మీ బతుకు చెడా: కేసీఆర్ తిట్లదండకం
2009లో టీడీపీతో కేసీఆర్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?
2009లో ఇదే కేసీఆర్ తెలుగుదేశం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని విజయశాంతి నిలదీశారు. అప్పుడు లేని దౌర్భాగ్యం ఇప్పుడు వచ్చిందా అని ప్రశ్నించారు. 2009లో ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడి ఉందని, అలాంటి సమయంలోనే ఆయన పొత్తు పెట్టుకున్నారని, ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఆయన ఈ మాట మాట్లాడుతున్నారని, ఈ మాట అప్పుడే మాట్లాడితే బాగుండేదన్నారు.
Recommended Video
తెలంగాణ వచ్చింది, కేసీఆర్ను గద్దె దించేందుకే టీడీపీతో పొత్తు
2009లో తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేఖ ఇచ్చినందునే తాను పొత్తు పెట్టుకున్నానని కేసీఆర్ చెప్పారని, కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి, ప్రజలకు ఏమీ చేయని కేసీఆర్ను గద్దె దించేందుకే టీడీపీతో తాము పొత్తు పెట్టుకుంటున్నామని ఘాటైన కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ను గద్దె దించేందుకు అందరం ఒక్కటవుతున్నామని, ప్రజలకు మంచి జరగాలంటే తెరాస ప్రభుత్వం దిగి పోవాలన్నారు.
పారిపోయన కేసీఆర్ ఏం చేస్తారు?
ఐదేళ్లు పాలించమని చెబితే, నాలుగున్నరేళ్లు పాలించి కేసీఆర్ పారిపోయారని విజయశాంతి ఎద్దేవా చేశారు. అలాంటి కేసీఆర్కు మరో అయిదేళ్లు అవకాశమిస్తే ఏం చేస్తాడని ప్రశ్నించారు. తెలంగాణను లూటీ చేయడం మినహా ఏమీ చేయరన్నారు. వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ముందస్తు ఎన్నికలకు తెరలేపారన్నారు.
చంద్రబాబు అడ్డుకున్నారు సరే, ఢిల్లీకి వెళ్లి మీరేం చేశారు?
టీడీపీ, చంద్రబాబు ప్రాజెక్టులను అడ్డుకున్నదని చెబుతున్న కేసీఆర్, ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో ఏం మాట్లాడి వచ్చారో చెప్పాలని విజయశాంతి ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయన్నారు. కేసీఆర్ పైకి చెప్పేదొకటి, చేసేది మరొకటి అన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు.
అమ్మవారి దయతో దుష్టశక్తి పాలన అంతం
తెలంగాణలో దుష్టశక్తుల పాలన నశించాలంటే అమ్మవారి దయ కావాలని, అందుకే జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో ప్రచారం ప్రారంభించామని మాజీ మంత్రి, కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు జోగులాంబ ఆలయంలో పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం తర్వాత వారు ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.