బార్లో గొడవ: పర్సు తీశావా అని అడిగితే వైజాగ్ టెక్కీని పొడిచేశారు
పర్సు తీశారా అని అడిగినందుకు వైజాగ్ టెక్కీని హైదరాబాదులో బీరు సీసాతో పొడిచేశారు. దాడిని చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాదులోని ఓ బారులో జరిగిన గొడవలో విశాఖపట్నం టెక్కీ గాయపడ్డాడు. పర్సు తీశారా అని వైజాగ్ టెక్కీ అడిగాడు. దాంతో ఇద్దరు వ్యక్తులు అతనిపై బీరుసీసాతో దాడి చేశారు. హైదరాబాదులోని కూకట్పల్లి లోని ఓ బార్లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
బీరు సీసాతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను గాయపర్చినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి సంగీతనగర్కు చెందిన ప్రవీణ్, రవితేజ(23), రోహిత్ అన్నదమ్ములు. ప్రవీణ్ చింతల్లో ఆటోమొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రవితేజ వైజాగ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రోహిత ఖమ్మంలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.
అన్న దమ్ములు ముగ్గురూ మద్యం తాగేందుకు కూకట్పల్లి వైజంక్షన్ సమీపంలోగల కేబీ బార్ అండ్ రెస్టారెంట్కు గురువారం రాత్రి వెళ్లారు. రవితేజ పర్సును టేబుల్పై పెట్టి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కౌంటర్ వద్దకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా పర్సు కనిపించలేదు. పక్క టేబుల్పై మద్యం తాగి కిందకు వెళ్తున్న మూసాపేటకు చెందిన విశాంత, మియాపూర్కు చెందిన నవీన్ను పర్సు తీశారా అని అడిగాడు.
తమను దొంగలంటావా అంటూ విశాంత బీరు సీసా పగులగొట్టి రవితేజ పొట్టలో నాలుగుసార్లు పొడిచాడు. ఘర్షణ విషయం తెలుసుకున్న రోహిత అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతడిని కూడా కొట్టి వారు పారిపోయారు. రవితేజను కేపీహెచ్బీ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విశాంత, నవీన్పై 307సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విశాంత హైదర్నగర్లోని మహీంద్రా షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా, నవీన్ ఎయిర్టెల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నారని ఎస్ఐ వెంకన్న తెలిపారు.