కేసీఆర్ జన్మించిన ఊరిలో గ్రామదేవతకు పూజలు: చండీయాగానికి వైఫై సేవలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుత చండీయాగం పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 23 నుంచి 25 వరకు తన ఫాం హౌస్కు సమీపంలోని ఎర్రవల్లిలో గ్రామంలో ఆయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చండీయాగానికి ముందు కేసీఆర్ స్వంత గ్రామమైన చింతమడకలో గ్రామదేవతల ఆశీర్వచనం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం 9 గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో గ్రామంలోని పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మాంకాలమ్మ ఆలయాల్లో ఈ పూజలు జరిగాయి.
సిద్దిపేట మండలం చింతమడక కేసీఆర్ జన్మించిన గ్రామం కావటంతో ఇక్కడ గ్రామదేవతలకు పూజలు జరిపించటం శుభప్రదమని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. సోమవారం వైకుంఠ ఏకాదశి కావడంతో సోమవారం పూజలు జరిపిస్తే అంతా మంచే జరుగుతుందని నిర్ణయించారు.
ఆలయాలకు సున్నాలు వేసి మామిడి తోరణాలతో అలంకరించారు. ఐదుగురు వేద పండితులతో పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం పట్టు వస్ర్తాలను ఎర్రవల్లి యాగశాలలో కేసీఆర్కు అందచేయనున్నారు. మరోవైపు ఆయుత చండీయాగం జరిగే చోట వైపై సేవలు అందించడానికి ప్రైవేట్ టెలికాం సంస్ధలు ఏర్పాట్లు చేశాయి.
ఇప్పటికే సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో 4జీ సేవలను అందించడానికి రిలయన్స్ అధ్వర్యంలో టవర్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్ధ బీఎస్ఎన్ఎల్ యాగశాలలో మొబైల్ టవర్ను ఏర్పాటు చేసి వైఫై సేవలు అందిస్తోంది. మిగిలిన ప్రైవేట్ సంస్థలు సైతం యాగం పూర్తయ్యే వరకు 3జీ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.