తిక్క రేగింది: ఏటీఎంలో డబ్బులు రావట్లేదని అద్దాలు పగలగొట్టాడు!..
కోఠి ఉమెన్స్ కాలేజీ సమీపంలో ఉన్న ఫెడరల్ బ్యాంకు ఏటీఎంపై తన ఆగ్రహాన్ని చూపించాడు. ఏటీఎంలో 'నో క్యాష్' అని రావడంతో ఏటీఎం అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు.
హైదరాబాద్: ఆర్బీఐ నుంచి తెలుగు రాష్ట్రాల బ్యాంకులకు సరైన మొత్తంలో నగదు అందకపోతుండటంతో రెండు రాష్ట్రాల్లోను చాలామంది సామాన్యులు కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంలు అన్ని 'నో క్యాష్ బోర్డు'తోనే దర్శనమిస్తుండటంతో నగదు కష్టాలు మళ్లీ మొదలైన పరిస్థితి కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో నగరంలోని చాలా ఏటీఎంలలో నగదు కోసం ప్రయత్నించి.. ఎక్కడా డబ్బు దొరక్కపోవడంతో నగరానికి చెందిన అమీర్ ఖాన్ అనే ఓ యువకుడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. కోఠి ఉమెన్స్ కాలేజీ సమీపంలో ఉన్న ఫెడరల్ బ్యాంకు ఏటీఎంపై తన ఆగ్రహాన్ని చూపించాడు. ఏటీఎంలో 'నో క్యాష్' అని రావడంతో ఏటీఎం అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు.
ఏటీఎం ధ్వంసం చేస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆపై అమీర్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. మరో వివాదం వెలుగుచూసింది. పెండింగ్ లో ఉన్న చలాన్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలంటూ పోలీసులు వేధించడంతోనే ఆగ్రహానికి లోనై ఏటీఎంపై దాడి చేసినట్లుగా అమీర్ చెప్పాడు.
ట్రాఫిక్ పోలీసులు తన వాహనాన్ని సీజ్ చేశారని, డబ్బు కట్టేందుకు ఏటీఎంకు వస్తే ఏ ఏటీఎంలోను డబ్బు రావట్లేదని, ఏంచేయాలో తోచని స్థితిలో ఏటీఎంను ధ్వంసం చేశానని చెప్పుకొచ్చాడు.