మిర్చి, పత్తికి రికార్డు ధర.. రైతుల ఆనందం.. పసుపు మాత్రం ఇలా
మిర్చి ధర దూసుకెళ్తుంది. దేశీయ మిర్చి రకం బంగారంతో సమానంగా పోటీ పడుతుంది. ఏటా క్వింటా దేశీయ మిర్చి రూ. 25 వేల నుంచి రూ. 28 వేలకు పలుకుతుంది. ఈ సారి ఆరంభం నుంచి దేశీయ మిర్చి రకం ధర పెరుగుతూ వస్తుంది. గత నెల 3వ తేదీన తొలిసారి క్వింటాల్ దేశీయ మిర్చి ధర రూ. 32వేలు పలుకగా.. అప్పటి నుంచి పెరుగుకుంటూ వస్తోంది.
మిర్చికి రికార్డు ధర
సోమవారం వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో కిషన్ రావు అనే రైతు తెచ్చిన దేశీయ మిర్చి రికార్డు స్థాయిలో రూ. 55,551 పలికింది. మిర్చికి అధిక ధర నమోదు కావడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెల్ల బంగారంగా పిలుచుకొనే పత్తి ధరలు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. గతేడాది పత్తి క్వింటా రూ. 7, 500 వరకు పలికింది. ఈ ఏడాది ప్రారంభంలోనే రూ. 8వేల పలికింది. క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం పత్తి క్వింటా రూ. 12,110 చేరింది.
ఎప్పుడూ ఇలా లేవు
పత్తికి, మిర్చికి గతంలో ఇలాంటి ధరలు ఎప్పుడూ చూడలేదని మార్కెట్ వ్యాపారులు, రైతులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మిర్చి, పత్తి పంటల దిగుబడులు తక్కువగా ఉండటంతో ధరలు అమాంతం పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. మిర్చికి తెగుళ్లు సోకి పంట దెబ్బతినగా, వర్షాల వల్ల పత్తి పంట దెబ్బతింది. ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవటంతో మిర్చి, పత్తికి రికార్డు ధరలు పలుకుతున్నాయి.
పసుపుకు ఇలా
మిర్చి, పత్తి పంటకు రికార్డు ధర పలికింది. పసుపు కూడా మంచి ధర వచ్చింది. అయితే వర్షం వల్లే చాలా మంది రైతులకు ఆశించిన స్థాయిలో పంట రాలేదు. అందుకే మెజార్టీ రైతులు పంటకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. వరి పంట కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఆందోళనలకు దిగుతున్న సంగతి తెలిసిందే. కానీ మిగతా పంటలకు మాత్రం అధిక రావడం శుభపరిణామమే.