అరుదైన గౌరవం: అక్కినేని పేరిట యుఎస్ పోస్టల్స్టాంప్
డల్లాస్: ప్రముఖ తెలుగు నటులు, నట సామ్రాట్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత దివంగత అక్కినేని నాగేశ్వరరావుకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ ఓ స్టాంపును విడుదల చేసేందుకు నిర్ణయించింది.
ఈ గౌరవం దక్కిన తొలి భారతీయ చలన చిత్ర నటుడిగా అక్కినేని నాగేశ్వర రావు చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) చేసిన కృషి ఫలితంగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. త్వరలో అమెరికా పోస్టల్ శాఖ ఈ స్టాంపును విడుదల చేయనుందని ఏఎఫ్ఏ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర గురువారం తెలిపారు.
సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వర రావు జన్మదినం సందర్భంగా డల్లాస్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ స్టాంపు విడుదల చేయనున్నట్లు ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. ‘‘అంతర్జాతీయ అక్కినేని అవార్డుల కార్యక్రమం'' పేరిట ఈ ఏడాది డిసెంబర్ 17న అక్కినేని కుటుంబసభ్యుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని గుడివాడలో ఏర్పాటు చేసే కార్యక్రమంలోనూ ఈ స్టాంపును విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
అక్కినేని జీవన గమనాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఏఎఫ్ఏ ఏర్పాటైందని ప్రసాద్ తోటకూరి చెప్పారు. ఏఎఫ్ఏ పౌండేషన్ ఆధ్వర్యంలో ఏఎఫ్ఏ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, ఉపాధ్యక్షుడు రవి కొండబోలు, కార్యదర్శి శారద ఆకునూరి, కోశాధికారి డాక్టర్ సిఆర్ రావు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ల, మురళీ వెన్నమ్, భక్తవత్సలు ధామ, చలపతి రావు కొండ్రకుంట, రావు కల్వలు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.