సాహితి: యువత స్పందన పెద్ద పీట
హైదరాబాద్: ‘మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం' ఐదవ రోజు సాంస్కృతిక పరంగా ప్రధానమైన అంశాలపై యువత స్పందన కి పెద్ద పీట వెయ్యడం జరిగింది. ముందుగా ఐదు గంటలకి మాధవీ లత గారి నిర్వహణలో స్నేహలతా మురళి బృందం వారి యువ గాయనీ గాయకులు లలిత గీతాలని ఆలపించారు. ఆ తరువాత జరిగిన ప్రారంభ సభలో సుప్రసిద్ద రచయిత్రులు డి. కామేశ్వరి, ముక్తేవి భారతి ‘స్ఫూర్తి ప్రదాతలు" గా యువ సాహితీవేత్తలని తమ ప్రసంగాలతో ఉత్తేజ పరిచారు.
సంస్కృతి ఎలా పరిరక్షించుకోవాలీ అనే కీలకమైన అంశాల మీద ప్రసంగించిన ఏడుగురు యువతీ యువకులలో విశ్వ విద్యాలయాలో ఫిల్మ్ క్లబ్ , ఫిజిక్స్ సొసైటీ, క్రీడా సంఘం అంటూ అనేక విద్యార్ధి సంఘాలు ఉన్నా , ఎక్కడా భాషా సాహిత్య సంఘాలు ఎందుకు లేవు అని ప్రశ్నిస్తూ ఆవేశపూరితంగా ఆంధ్ర విశ్వ విద్యాలయం (విశాఖపట్నం) విద్యార్ధి బోయిలాడ బాబు ప్రసంగం మొదలైనవి యువతరం ఆవేదనని వెలిబుచ్చాయి. కొందరు యువ వక్తలు భాషా, సాహిత్య పరిరక్షణ విషయాలలో జరుగుతున్న అవకతవకలకి కన్నీళ్ళు పెట్టుకుని ముందుకి సాగలేకపోవడం ప్రేక్షకుల కళ్ళు కూడా చెమర్చింది.
ఆ తరువాత జరిగిన చర్చా వేదికలో "ఈ నాటి కుర్రకారుకి కేవలం సినిమాల ద్వారానే మన పండుగల గురించి కాస్తో, కూస్తో తెలుసుకానీ...." అని అందరూ అనుకునే పరిస్థితిలో మన పండుగలూ, నోములూ అనే అంశం మీద ఆ వేదికలో పాల్గొన్న ఎనిమిదిమందికి ఉన్న అవగాహన భికులని ఆశ్చర్యచకితుల్ని చేసింది. అలాగే మన చారిత్రక ప్రదేశాలనీ పరిరక్షించుకునే అంశం పై యువత స్పందన చాలా శాస్త్రీయ దృక్పథంతో అందరినీ ఆకట్టుకుంది.
అక్టోబర్ 5 దాకా ప్రతీ రోజూ సాయంత్రం 5 నుండి జరిగే ఈ యువ సాహితీ సభలకు అందరూ ఆహ్వానితులే. రేపటి ఆరవ రోజు సభలో (అక్టోబర్ 4, 2013) సినిమాలు, ఇతర ప్రసంగా మాధ్యమాలపై ప్రసంగాలు, ప్రపంచీకరణ ప్రభావం, అంతర్జాలం, బ్లాగులు మొదలైన అంశాలపై చర్చా వేదిక జరుగుతాయి. ‘ఇందులో నాకేమిటీ?" అనే చవక బారు దృక్పథాన్ని "మానసికంగా' అధిగమించి, భావి తరాల వారి స్పందనకి విలువ ఇచ్చే లబ్దప్రతిష్టులైన సాహితీ వేత్తలకి రేపటి సమావేశం మహత్తర అవకాశం.