తెలుగు సినిమాల్లో తెలంగాణ కవుల జోరు
దాశరథి,త డాక్టర్ సి. నారాయణ రెడ్డి వంటి తెలంగాణ కవులు తెలుగు సినిమా గేయ కవిత్వానికి కొత్త సొబగులు, కొత్త అందాలు తెచ్చి పెట్టారు. తెలంగాణ, ఉర్దూ భాష సౌందర్యాన్ని తెలుగు సినిమాకు అద్దారు. ఆ తర్వాత తెలుగు సినీ రంగానికి పలువురు గేయ రచయితలు తెలుగు సినీ తెరకు పరిచమయ్యారు. అశోక్ తేజ తెలుగు సినిమా గేయ రచయితల్లో ప్రముఖంగా వెలుగొందుతున్నారు. ఆయన రాసిన పాటలకు కూడా అవార్డులు వచ్చాయి. తెలుగు సినిమాకు తెలంగాణ, నక్సలైట్ ఉద్యమం కూడా కథావస్తువులు కావడంతో తెలంగాణ ఉద్యమ కవులకు సినిమాల్లో చోటు లభించింది. మా భూమి ద్వారా గద్దర్ వంటి కవులు ముందుకు వచ్చారు. తెలుగు సినిమాల్లో గద్దర్ పాటలకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. జై బోలో తెలంగాణ సినిమాలో గద్దర్ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
చంద్రబోస్ లాంటి కవులు కూడా తెలుగు సినిమా రంగంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. గూడ అంజయ్య, మాస్టర్జీ వంటి కవుల పాటలు కూడా తెలుగు సినిమాలకు వాడుకున్నారు. నారాయణమూర్తి సినిమాల్లో తెలంగాణ ఉద్యమ కవుల పాటలు తప్పకుండా ఉంటాయి. అందెశ్రీ, గోరటి వెంకన్న పాటలు తెలుగు సినిమా సాహిత్యాన్ని మరింత విస్తృతం చేశాయి. అందెశ్రీ కూడా అవార్డు అందుకున్నారు. మైసమ్మో మైసమ్మ పాట తెలుగులో మారు మోగిన పాట. దాన్ని రాసింది ఓ తెలంగాణ కవే. ఇంకా చాలా మంది కవులు తెలుగు సినీరంగంలో తమ ఉనికిని చాటుతున్నారు.