షాక్ తింటున్న బీటెక్ విద్యార్థులు: ఎందుకిలా?, టాప్ కాలేజీల్లోను ఇలాంటి పరిస్థితా?..
Recommended Video
హైదరాబాద్: ఎప్పుడైతే పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చాయో.. క్రమంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ తగ్గిపోవడం మొదలైంది. సరైన ఫ్యాకల్టీ ఉండరు, సరైన ల్యాబ్స్, వసతులు ఉండవు. అయినా సరే, ఇంజనీరింగ్ చదవాలన్న యువత క్రేజ్.. ఎందుకు పనికిరాని కాలేజీలకు కూడా వరం లాగా మారింది.
అదే సమయంలో కొద్దో గొప్పో మంచి స్టాండర్డ్స్ ఉన్న కాలేజీలుగా పేరు తెచ్చుకున్నవాటిల్లో ప్రవేశాలకు డిమాండ్ పెరిగింది. బయట ఏ కాలేజీలో చదివినా.. అటు సరైన చదువు రాక, చదువయ్యాక ఉద్యోగం రాక తిప్పలు పడాల్సి వస్తుండటంతో.. లక్షల డొనేషన్లు కట్టి మరీ ఈ టాప్ కాలేజీల్లో చేరడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.
టాప్ కాలేజీల్లో చేరినా:
టాప్ కాలేజీల్లో చేరినా సరే.. క్యాంపస్ రిక్రూట్ మెంట్లు ఆశించినంతగా లేకపోతుండటం ఇప్పుడు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలవరపెడుతోన్న అంశం. లక్షలు పోసి చదువుకున్నా.. ఉద్యోగాలు రాకపోతుండటంపై వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గతేడాది ఆయా కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్ మెంట్ల ద్వారా సుమారు 500-600మంది విద్యార్థులకు ఉద్యోగాలు రాగా.. ఈ ఏడాది ఆసంఖ్య 150కి పడిపోవడం గమనార్హం. దీంతో టాప్ కాలేజీల్లో చదివినా.. ఉద్యోగానికి గ్యారెంటీ లేదనట్లుగా తయారైంది పరిస్థితి.
పేరుకే టాప్ కాలేజీలు:
తెలంగాణలో 2017-18 విద్యా సంవత్సరంలో 212 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 198 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు. ఇందులోను టాప్ కాలేజీలన్న పేరున్నవి 10-15 మాత్రమే. విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కల్పిస్తాయన్న భరోసానే వీటిని టాప్ లిస్టులో చేర్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా క్యాంపస్ రిక్రూట్ మెంట్లు ఉంటాయన్న భరోసాతోనే లక్షలు కట్టి మరీ విద్యార్థులను ఇందులో చదివిస్తున్నారు. కానీ ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్ మెంట్లు తగ్గిపోవడంతో వారిలో ఒకరకమైన భయం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ లోను ఇదే పరిస్థితి:
ఒక్క తెలంగాణలోనే కాదు అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇదే రకంగా తయారైంది పరిస్థితి. ఏటా 800-900 క్యాంపస్ రిక్రూట్ మెంట్లు జరగాల్సిన చోట కేవలం 100-200మంది విద్యార్థులే క్యాంపస్ రిక్రూట్మెంట్లలో జాబ్ దక్కించుకుంటుండటం గమనార్హం. విజయవాడ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ అధికారి ఈ విషయం వెల్లడించినట్లు తెలుస్తోంది.
క్యాంపస్ రిక్రూట్మెంట్లతో వ్యాపారం:
క్యాంపస్ రిక్రూట్మెంట్లే బడా కాలేజీలకు పెద్ద వ్యాపారంలా మారాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. రిక్రూట్మెంట్ల ఆశచూపి విద్యార్థుల నుంచి కాలేజీలు ఎడాపెడా డబ్బులు వసూలు చేస్తున్నాయి.ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వెనుకడాడటం లేదు. ఆఖరికి అప్పు చేసైనా సరే కొంతమంది తల్లిదండ్రులు అడిగినంత డొనేషన్లు కడుతున్నారు.
నిబంధనలు బేఖాతరు:
నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి డొనేషన్లు వసూలు చేయకూడదు. కానీ కొన్ని కాలేజీ యాజమాన్యాలు యథేచ్చగా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. బ్రోకర్లను, పీఆర్వోలను పెట్టుకుని మరీ విద్యార్థులతో బేరసారాలు కుదుర్చుకుని అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. కాలేజీల డొనేషన్ల దందాపై అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రిక్రూట్ మెంట్లు తగ్గడానికి కారణం:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత.. కొత్తగా వచ్చిన వీసా నిబంధనలు, స్థానికులకే ప్రాధాన్యత, ఆటోమేషన్ ప్రభావం వంటివి కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి. విదేశీ ప్రాజెక్టులు కూడా తగ్గిపోతుండటంతో కంపెనీలు రిక్రూట్ మెంట్లు తగ్గించాయి.
గతంలో లాగా విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి శిక్షణ ఇచ్చేందుకు కంపెనీలు మొగ్గుచూపడం లేదు. కొత్త టెక్నాలజీని అప్పటికే నేర్చుకున్నవారిని రిక్రూట్ చేసుకోవడానికే కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర టెక్నాలజీలపై పూర్తి అవగాహన ఉన్నవారికి, నెట్వర్క్ సెక్యూరిటీకి మాత్రమే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది.