నీళ్ల కోసం విద్యార్థినులు వీధికెక్కారు (పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖపట్నంలోని కెజిహెచ్ నర్సింగ్ విద్యార్థినులు నీళ్ల కోసం సోమవారం వీధికెక్కారు. విధులను బహిష్కరించారు. ఆస్పత్రి సూపరింటిండెంట్ను నిలదీశారు. వసతి గృహం ట్యూటర్లు, మ్యాట్రిన్లను వెంటబెట్టుకుని సూపరింటిండెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఐదు రోజులుగా నర్సింగ్ క్వార్టర్లకు నీరు రాకపోవడంతో వారి ఇబ్బందులు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేక అలమటిస్తున్నారు. నర్సింగ్ కళాశాల, మహిళా వైద్యులు, పిజి డాక్టర్ల క్వార్టర్లకు కూడా ఐదు రోజులుగా నీటి సరఫరా లేదని హాస్టల్ విద్యార్థులు చెప్పారు.
మున్సిపల్ ట్యాంకులు ద్వారా నీటిని తెప్పించుకుంటున్నట్లు నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అరుణశ్రీ చెప్పారు. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ఆస్పత్రి ఆవరణలోని మార్చురీ వద్ద గల రోగుల సహాయకుల కోసం నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ మూతపడింది.
నీటి కష్టాలు ఇలా..
వసతి గృహాలన్నింటికీ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లోని బోరు ఒక్కటే ఆధారం కావడంతో రోగులు నీటి కష్టాలను ఎదుర్కుంటున్నారు.
వైద్య సేవలకు అంతరాయం
నర్సింగ్ విద్యార్థినుల ఆందోళనతో వైద్య సేవలకు అంతరాయం కలిగింది. సూపరింటిండెంట్ వెంటనే మున్సిపల్ కమిషనర్ను ఫోనులో సంప్రదించారు.
మున్సిపల్ కమిషనర్కు వినతి
తాము పడుతున్న నీటి కష్టాలను సూపరింటిండెంట్ మున్సిపల్ కమిషనర్కు వివరించి, సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
పైపులైన్ పగిలిపోయి..
రోడ్డు పనుల సందర్భంగా ప్రొక్లయిన్ వల్ల పైపు పగిలిపోయింది. ఫలితంగా శుక్రవారం నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది.
రోడ్డు పనులు ప్రారంభం
జివిఎంసి వాటర్ వర్క్స్ విభాగం ఇంజనీర్లు వెంటనే మరమ్మతులు చేపట్టారు. అనుమతి లేకుండా అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టడం సరి కాదని సంబంధిత అధికారి డాక్టర్ బంగారయ్య అన్నారు.