ఎన్నికల్లో రామోజీపైనా పోరు
ఈనాడు దినపత్రికపై తాజాగా మరోసారి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ రాదని ఆ పత్రిక రాసిన వార్తపై ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కార్యక్రమంలో గుర్రుమన్నారు. తమను తామే వ్యతిరేకించుకునే పద్ధతిలో ఈనాడులో వార్తలు ఉంటాయని ఆయన అన్నారు.తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈనాడు దినపత్రికపై ఆయన కత్తి కట్టిన విషయం తెలిసిందే. ఈనాడు పత్రిక తెలుగుదేశం పార్టీకి అనుకూలమనే భావన నాటుకుపోవడమే అందుకు కారణం. ఈనాడును ఏకఛత్రాధిపత్యాన్ని దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి దినపత్రికను, టీవీ చానెల్ ను పెట్టారు. ఆ పత్రికపై, టీవీ చానెల్ పై తెలుగుదేశం పార్టీ విమర్శలు ఉన్నాయి. ఈ ప్రసార మాధ్యమాలపై కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. సాక్షి రాసిన ఒక వార్తాకథనంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. జగన్ కు, మరి కొంతమందికి హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.
సాక్షి దినపత్రిక స్థాపనతో ఆంధ్రప్రదేశ్ లో మీడియా వార్ ప్రారంభమైంది. ఈనాడు దినపత్రిక పాలసీ ప్రజలకు తెలియంది కాదు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాడు దినపత్రిక ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన పత్రిక అండదండలూ ఎప్పుడూ ఉపయోగపడుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ కు మద్దతు తెలిపేవారు పత్రికలు పెట్టినా వారు సమర్థంగా వ్యవహరించలేకపోయారు. పాలసీని అంతర్గతంగా సాగిస్తూ వార్తలను సమగ్రంగా ఇవ్వడంలో మిగతా పత్రికలు విఫలమయ్యాయి. దాంతో కాంగ్రెసుకు మొదటి నుంచి కూడా ఆ లోటు ఉంటూనే వచ్చింది. తాజాగా సాక్షి ఆ లోటును పూడ్చడానికి ముందుకు వచ్చింది.భారీ హంగులతో వచ్చిన ఆ పత్రిక కూడా సరైన నిర్వహణ లేక సమర్థవంతమైన పాత్రను నిర్వహించలేకపోతోంది. వార్తా కథనాలను సరైన పద్ధతిలో పెట్టే వారు, రుజువులతో బలమైన వార్తా కథనాలు రాసే వారు ఆ పత్రికలో కరువయ్యారు.వార్తా కథనాల నిర్వహణ అనేది లేకుండా పోయింది. ఉద్యోగుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ, వేతనాలు అధికంగానే ఉన్నప్పటికీ సమర్థులైన జర్నలిస్టుల కొరత ఆ పత్రికను పట్టి పీడిస్తోంది.దాంతో పాలసీని, ఇతర వార్తలను వేరు చేసే పద్ధతి గానీ, పాలసీని సమర్థంగా, అంతర్లీనంగా ప్రొజెక్టు చేసే సత్తా గానీ దానికి లేకుండా పోయింది. ఇది కచ్చితంగా యాజమాన్య లోపమే.
యాజమాన్యాలు సరైన జర్నలిస్టులను ఎంపిక చేసుకోవడంలో విఫలం కావడమే, అంటే పై స్థాయిలో సరైన వారిని ఎంపిక చేసుకోకపోవడం వల్లనే ఈనాడుకు దీటుగా మరో పత్రిక నిలబడలేకపోతోంది. జర్నలిస్టుల ఎంపికలో వ్యక్తిగత ఇష్టానిష్టాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆ ఎంపిక ప్రక్రియను సరైన వారికి అప్పగించకపోవడం వస్తున్న ప్రమాదం ఇది. లేదంటే యాజమాన్యాలు జర్నలిస్టుల ఎంపికలో పైకి కనిపించే విధేయతకు ప్రాధాన్యం ఇవ్వడం కారణం కావచ్చు. ఏమైనా, ఈనాడు, సాక్షి దినపత్రికలు పరస్పరం విమర్శలు చేసుకోవడం వల్ల ప్రజలకు అసలు విషయాలు తెలిసే అవకాశం మాత్రం లభించింది.