టిడిపి, కాంగ్రెస్లో రచ్చ: జగన్కు జై, కానీ అరెస్టైతే?
ఇందుకోసం తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే దేవేందర్ గౌడ్కు రాజ్యసభ పదవిని కట్టబెట్టడం పట్ల మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయన జగన్ వైపు వెళ్లనున్నారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. అదే బాటలో మరికొందరిని తమ వైపుకు రప్పించుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. టిడిపి కంటే కాంగ్రెసు రాష్ట్ర అగ్ర నేతల మధ్య విభేదాలు జగన్కు ఎక్కువగా కలిసి వస్తుందని అంటున్నారు.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు రాష్ట్రమంతా చర్చనీయాంశమయ్యాయి. పార్టీ పరిస్థితి ఇప్పటికే క్లిష్టంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో బొత్స, కిరణ్ మధ్య విభేదాలు పార్టీని మరింత నష్టపరుస్తున్నాయని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలాగే ఉంటే 2014 ఎన్నికల్లో గెలుపు అంత సులభం కాదని బాహాటంగానే చెబుతున్నారు. దీంతో వారు జగన్ పార్టీ వైపు చూస్తున్నారట.
డైలమాలో ఉన్న నేతలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దృష్టి సారించిందని చెబుతున్నారు. ఇటీవల కొవూరు ఫలితాలతో పలువురు ఢీలా పడ్డారట. త్వరలో జరగనున్న పద్దెనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికలలోనూ కాంగ్రెసు పరాజయం పాలైతే జగన్ వైపుకు వెళ్లేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారట. అయితే తమ పార్టీలలోని అసంతృప్తి, విభేదాల కారణంగా జగన్ వైపుకు వెళదామనుకుంటున్న టిడిపి, కాంగ్రెసు నేతలు మరో ఆలోచన కూడా చేస్తున్నారట.
ఒకవేళ ఆస్తుల కేసులో జగన్ అరెస్టయితే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనే కోణంలోనూ చర్చిస్తున్నారట. అయితే ఆయా నేతలను తమ వైపు తీసుకు వచ్చేందుకు జగన్ పార్టీ నేతలు మాత్రం తెరవెనుక ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.