మోడీ పిలుపుకు అఖిలేష్ నవ్వి ఊరుకున్నారు!
లక్నో: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలు పంచుకోవడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేత నామినేట్ అయిన క్రికెటర్ సురేశ్ రైనా తదితరులంతా ఉత్తరప్రదేశ్లో స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగస్వాములు కావడం ఒక గౌరవంగా భావిస్తున్నామని పేర్కొనగా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం దీనిపై విలేకరులు అడిన ప్రశ్నలకు నవ్వేసి ఊరుకున్నారు.
మోడీ శనివారం ఉదయం తన లోకసభ నియోజకవర్గం అయిన వారణాసిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉత్తరప్రదేశ్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సహా 9 మంది ప్రముఖులను నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
దీని పైన అఖిలేష్ స్పందించేందుకు శనివారం నిరాకరించారు. ఉత్తరప్రదేశ్లో స్వచ్ఛ భారత్ ఉద్యమంలో పాలు పంచుకోవడానికి ప్రధాని నియమించడం గురించి విలేకరులు లక్నోలో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద అఖిలేష్ను ప్రశ్నించగా.. ఆయన నవ్వేసి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు.
పరిశుభ్రత అనేది మన నాగరికతకు ప్రతిబింబమని, ఇది ఒక కలగా ప్రారంభమైందని, అయితే మనమంతా కలిసి దీన్ని మన మిషన్గా చేయాలని రైనా అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిసిన తర్వాత తాను ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటానని రైనా ట్వీట్ చేశారు.
ప్రధాని నామినేట్ చేసిన తొమ్మిది మందిలో ఉన్న ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్, హాస్య నటుడు రాజు శ్రీవాస్తవలు ప్రధాని ఈ ఉద్యమంలో తమను భాగస్వాములను చేయడం పట్ల తామెంతో గర్విస్తున్నామని వ్యాఖ్యానించారు. మొదట తాను యూపీలో పాల్గొని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలుచోట్ల పాల్గొంటానని రాజు చెప్పారు.