కెసిఆర్ దూకుడు: ఆ మూడింట టిఆర్ఎస్దే గెలుపు
వరంగల్: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి ఆదివారం జరిగిన పోలింగ్లో ఓటర్లు అధికార టిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో టిఆర్ఎస్ చరిత్రాత్మక విజయం సాధించింది.
ఇప్పుడు ఈ మూడుచోట్ల కూడా తెరాసదే గెలుపు అని చాలామంది భావిస్తున్నారు. టిఆర్ఎస్ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మీద ఓటర్లు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారని, సాధించిన తెలంగాణను బాగుచేయగల నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని ప్రజలు భావిస్తున్నారని తెరాస నేతలు చెబుతున్నారు.
సంక్షేమ పథకాలు కూడా కారు దూకుడుకు కారణమని చెబుతున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఓటింగ్కు తరలివచ్చినట్టుగా కనబడిందని అంటున్నారు. అచ్చంపేటలో 70 శాతం, ఖమ్మంలో సైతం 67 శాతానికి పైగా వరంగల్లో 60 శాతం పోలింగ్ జరిగింది.
వరుస ఎన్నికల ప్రభావం వల్లే వరంగల్ కార్పొరేషన్ పరిధిలో మిగతా వాటికన్నా కాస్త పోలింగ్ తగ్గిందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ కడా పాజిటివ్ ఓటింగే జరిగిందని భావిస్తున్నారు. ఎన్నికలు జరిగిన మూడు పురపాలికలు టిఆర్ఎస్ ఖాతాలో పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీల్లో ఎక్కువ డివిజన్లను తెరాసనే దక్కించుకునేలా కనిపిస్తున్నాయి. అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు, కెసిఆర్ పైన విశ్వాసంతో పాటు ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర రావు వంటి నేతలు కూడా తెరాసకు కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు.
ఖమ్మంలో సీమాంధ్ర ప్రభావం అధికంగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాదులాగే ఇక్కడ కూడా.. సీమాంధ్రులు తెరాసపై విశ్వాసంతో ఉన్నారని అంటున్నారు. ఖమ్మంలోని 50 డివిజన్లలో 40 డివిజన్ల వరకు తెరాస గెలుచుకోనుందని భావిస్తున్నారు.
వరంగల్లో 58 డివిజన్లు ఉండగా 50 వరకు తెరాస ఖాతాలో పడనున్నాయని అంటున్నారు. వరంగల్లో గత ఉప ఎన్నికల్లో తెరాస జోరు కనిపించింది. పైగా ఎర్రబెల్లి దయాకర రావు, కొండా సురేఖ వంటి కీలక నేతలు ఉన్నారు. దీని వల్ల మెజార్టీ స్థానాలను తెరాస గెలుచుకోనుందని చెబుతున్నారు. అచ్చంపేటలో 20 వార్డులకు గాను తెరాస మెజార్టీ వార్డులు గెలుచుకుంటుందని భావిస్తున్నారు.