ఆయన మనసు బంగారం: ఉద్యోగులకు కానుకగా 400 ఫ్లాట్లు, 1260 కార్లు!
సూరత్: కష్టం తెలిసిన వ్యక్తి ఒక సంస్థకు యజమానిగా ఉంటే.. ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు దక్కే ప్రయోజనాలు ఎలా ఉంటాయో నిరూపిస్తున్నారు ఈ గుజరాత్ వ్యాపార దిగ్గజం. ఆయన తమకు ఇస్తున్న కానుకలు, ప్రయోజనాలతో ఉబ్బితబ్బిబయ్యే ఆ సంస్థ ఉద్యోగాలు మా బాస్ మనసు బంగారం అనకుండా ఉండలేకపోతున్నారు. ఆయనే గుజరాత్ సూరత్లోని వజ్రాల వ్యాపారి, కోటీశ్వరుడు సావ్జీ ఢోలకియా. ఎప్పటిలాగే ఈ దీపావళికి కూడా ఉద్యోగులకు కానుకలిచ్చి ఉదారతలో తనకు ఎవరూ సాటిలేరని చాటుకున్నారు.
ప్రతీ ఏటా కానుకలు
ఏటా ఉత్తమ సేవలు అందించే ఉద్యోగులకు పెద్ద ఎత్తున బహుమానాలు ఇస్తూ ప్రత్యేకత చాటుకునే ఢోలకియా ఈ ఏడాది కూడా దీపావళికి భారీ స్థాయిలో బహుమతులు ప్రకటించారు. ఢోలకియా యాజమాన్యంలో వజ్రాల వ్యాపారం చేసే హరేకృష్ణ ఎక్స్పోర్ట్స్ కంపెనీ తన ఉద్యోగులకు దీపావళి బోనస్గా 1,260 కార్లు, 400 ఫ్లాట్లు బహుమతులుగా ప్రకటించింది.
స్వర్ణోత్సవ శోభ
కంపెనీ స్వర్ణోత్సవాల్ని పురస్కరించుకుని ఈ ఏడాది బోనస్ కోసం రూ.51 కోట్లు వెచ్చిస్తోంది. కంపెనీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల జాబితాలో 1,716 మంది ఉన్నారు. బోనస్ వివరాల్ని మంగళవారం ఉద్యోగులతో నిర్వహించిన అనధికార సమావేశంలో ప్రకటించారు.
ఆయన మనసు బంగారం: ఉద్యోగులకు కానుకగా 400 ఫ్లాట్లు, 1260 కార్లు!
నిరుడు ఈ కంపెనీ 491 కార్లు, 200 ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చింది. గతంలో బోనస్ కోసం రూ.50 కోట్లు వెచ్చించినట్లు హరేకృష్ణ ఎక్స్పోర్ట్స్ యజమాని ఢోలకియా పేర్కొన్నారు.
సావ్జీ ప్రస్థానం
సావ్జీ ఢోలకియా(53).. జీవితం ముందునుంచీ సుఖమైన జీవతమేం కాదు. కరవు పీడిత సౌరాష్ట్రలోని అమ్రేలీ జిల్లా దుఢాలా అనే కుగ్రామానికి చెందిన ఢోలకియా వజ్రాల పరిశ్రమలో పని వెదుక్కుంటూ సూరత్ చేరారు. 1978లో ఆయన రూ.169 నెల జీతంతో జీవిత ప్రస్థానాన్ని ఆరంభించారు. వజ్రాలు సానబెట్టే కార్మికుడిగా, తర్వాత మధ్యవర్తిగా పని చేశారు. 1991లో సొంత వ్యాపారం మొదలు పెట్టారు. అప్పట్లో ఆయన ద్విచక్ర వాహనంపై తిరిగేవారు. వజ్రాలకు సానపెట్టే ఈ కంపెనీ కాలక్రమంలో ఏటా రూ.6 వేల కోట్ల టర్నోవర్తో వ్యాపారం చేసే స్థాయికి ఎదిగింది. జీవితం విలువ తెలియడం కోసం తన కుమారుడు ద్రవ్యను గతంలో కొంతకాలం పాటు సొంతంగా బతికి రమ్మంటూ మూడు జతల దుస్తులు, రూ.7 వేల నగదు మాత్రమే ఇచ్చి కోచ్చికి పంపించి ప్రత్యేకతను చాటుకున్న విషయం తెలిసిందే.