రివర్స్: భర్తకు భార్య వేధింపులు, వేరే వ్యక్తితో పెళ్లి
ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ భర్త తన భార్య తనను వేధిస్తోందని ఫిర్యాదు చేస్తూ ఆమె నుంచి తనకు రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నాడు.
హైదరాబాద్: ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భర్త వేధిస్తున్నాడంటూ భార్య ఫిర్యాదు చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఓ భర్త తన భార్య వేధిస్తోందని మొరపెట్టుకున్న సంఘటన జరిగింది. తన భార్య వేధింపుల నుంచి తనను, కుటుంబ సభ్యులను కాపాడాలని పులిపాటి నవీన్బాబు అనే వ్యక్తి శుక్రవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను కోరాడు.
తన భార్య మతాంతర వివాహం చేసుకుని గృహహింస చట్టం కింద కుటుంబాన్ని వేధిస్తోందని, విడాకులు ఇవ్వకుండానే తనకు పుట్టిన బాబును వెంట తీసుకెళ్లిందని ఫిర్యాదులో చెప్పాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఏప్రిల్ 24 నాటికి ఈ కేసుకు సంబంధించిన సమగ్రమైన నివేదికను అందజేయాలని నల్గొండ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
నల్గొండ టౌన్ పద్మావతి కాలనీకి చెందిన మార్కండేయ కుమారుడు పులిపాటి నవీన్బాబుకు హాలియా పట్టణానికి చెందిన రామచంద్రయ్య కూతురు గంగాభవానీ అలియాస్ శారదతో 2007లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వారు హైదరాబాద్ లంగర్హౌజ్లో రెండేళ్లపాటు ఉన్నారు. వారికి శంతన్ అనే కుమారుడు ఉన్నాడు.
ఆ తర్వాత చెన్నైలో ఉద్యోగం రావడంతో నవీన్ అక్కడి వెళ్లగా అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో ఆమె మరో వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. తన కుటుంబ సభ్యులపై మహిళా పోలీసుస్టేషన్లో వరకట్నం, గృహహింస కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని నవీన్ ఆరోపించారు.
తనకు పుట్టినబాబును బలవంతంగా మతాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని, విడాకులు కోరితే రూ.50లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్కు పాల్ప డుతున్నారని ఫిర్యాదు చేశారు. ఆమె,ఆమెకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు