జగన్ టార్గెట్: చంద్రబాబుతోనే పవన్ కల్యాణ్, పొత్తు ఖరారు ఇలా...
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోనే కలిసి నడవాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోనే కలిసి నడవాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా జరిగిపోయినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబుతో కలిసి నడవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిజెపి, జనసేనలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికే చంద్రబాబు కూడా మొగ్గు చూపిన నేపథ్యంలో ఈ పొత్తు కుదిరినట్లు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ మన మిత్రుడేనని, పవన్ కల్యాణ్ను విమర్శించవద్దని ఇటీవల చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు సూచించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు ప్రభుత్వంపై ఏ విధమైన విమర్శలు ఎక్కు పెట్టడం లేదు.
జనసేన సీట్ల సంఖ్య...
చంద్రబాబు సూచనలు, పవన్ కల్యాణ్ వైఖరి తెలుగుదేశం పార్టీ,, జనసేనల మధ్య పొత్తు ఖాయమనే అభిప్రాయం ఏర్పడడానికి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు 40 సీట్లు కావాలని జనసేన అడుగుతోందని, దానికి తెలుగుదేశం అధినేత కూడా సూచన ప్రాయంగా అంగీకరించారని ప్రచారం సాగుతోంది.
బలం ఉన్న చోట్లలోనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 కాగా జనసేన వాటిల్లో 40 సీట్లలో పోటీ చేసే ఆసక్తితో ఉందని అంటున్నారు. తమ పార్టీ అన్ని చోట్లా పోటీ చేయదని, బలం ఉన్న చోట మాత్రమే పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ఇటీవల చెప్పన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తన బలంపై కచ్చితమైన అంచనాకు వచ్చే జనసేన 40 సీట్లు అడుగుతున్నట్లు చెబుతున్నారు.
ప్రజారాజ్యం గెలిచిన సీట్లు..
ప్రజారాజ్యం అనుభవం నేపథ్యంలో అతి విశ్వాసంతో ముందుకు వెళ్లకూడదని పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 17 సీట్లు గెలుచుకుంది. ఇవన్నీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిదిలోనే ఉన్నాయి. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ గట్టి పోటీని ఇచ్చి, రెండో స్థానంలో నిలిచింది. గట్టి పోటీ ఇచ్చిన ప్రజారాజ్యం రెండో స్థానంలో నిలిచిన సీట్లను కూడా పవన్ కల్యాణ్ అడుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
పొత్తు లాంఛనమేనా
శాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించి 40 సీట్లను పవన్ కల్యాణ్ చంద్రబాబు ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తమకు కావాల్సిన సీట్లపై ఆ రకంగా పవన్ కల్యాణ్ స్పష్టతకు వచ్చినట్లు చెబుతున్నారు. అందువల్ల తెలుగుదేశం, జనసేన మధ్య పోటీ లాంఛనమేనని భావిస్తున్నారు.
జగన్ టార్గెట్....
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరి టార్గెట్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అని అంటున్నారు. అందువల్ల కలిసి నడవకపోతే జగన్ను ఎదుర్కోవడం కష్టమని కూడా భావిస్తున్నట్లు సమాచారం. బిజెపికి దగ్గరైనట్లు కనిపించిన జగన్ ఇప్పుడు దూరమైనట్లు కూడా చెబుతున్నారు. జగన్ను దూరంగా పెట్టి, చంద్రబాబుతో కలిసి నడిచే ఆలోచనలోనే ప్రస్తుతం బిజెపి ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.