తేల్చండి: డిజిపి పిటిషన్పై ప్రభుత్వానికి క్యాట్ ఆదేశం
హైదరాబాద్: తనను డిజిపిగా కొనసాగించాలన్న దినేష్ రెడ్డి పిటిషన్ పైన క్యాట్లో శుక్రవారం విచారణ జరిగింది. దినేష్ రెడ్డి వినతి నేపథ్యంలో ఆయనను కొనసాగించాలా? వద్దా? అనే విషయమై నిర్ణయం తీసుకోవాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు తమకు రెండు వారాలు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో, ఈ నెల 23వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి డిజిపిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లు ఆ పదవిలో కొనసాగించాలని కోరుతూ దినేష్ రెడ్డి ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. సర్వీసు నిబంధనల మేరకు 2013 సెప్టెంబర్లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన నియామకాన్ని ప్రశ్నిస్తూ క్యాట్లో పిటిషన్ దాఖలు కాగా దినేష్ నియామకం చెల్లదంటూ గతంలో తీర్పు వెలువరించింది.
దీంతో ప్రభుత్వం సీనియర్ అధికారుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్కు పంపి వారు సూచించిన జాబితా నుంచి దినేష్ రెడ్డిని ఎంపిక చేసి పునర్నియామకం జరిపింది. ప్రకాశ్ సింగ్ కేసులో.. రాజకీయ ఒత్తిళ్లను అధిగమించడానికి డిజిపి(హెచ్ఓపీఎఫ్) పోస్టులో నియమించిన అధికారులను పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా రెండేళ్లు కొనసాగించొచ్చని సుప్రీం తీర్పు ఇచ్చింది. దీనిని అనుసరించి తనను డిజిపిగా కొనసాగించాలని ఆగస్టు 21న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞాపన పత్రం ఇచ్చానని పిటిషన్లో దినేష్ పేర్కొన్నారు.
డిజిపి ప్రత్యేక పూజలు
పాతబస్తీలో డిజిపి దినేష్ రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హబీబ్ బద్రూస్ అనే వ్యక్తి చేతుల మీదుగా ఈ పూజలు జరిగాయి. పోలీసు భద్రత నడుమ పూజా కార్యక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవల డిజిపి ఆస్తులపై సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ ఘటన అంతటా చర్చకు దారి తీసింది.