దుర్గామాత ఐదవ స్వరూపం స్కందమాత
స్కందమాత
సింహాసనగతా
నిత్యం
పద్మాశ్రితకరద్వయా
శుభద్కాస్తు
సదా
దేవీ
స్కందమాతా
యశస్వినీ
దుర్గామాతయొక్క ఐదవస్వరూపము స్కందమాత అను పేర ప్రసిద్ధి వహించినది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు కార్తీకేయుడు అనునదు మఱియొకపేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామమున ఈయన దేవతలసేనలకు అధిపతిగా నుండెను. పురాణములు ఈయనను శక్తిధరుడని పేర్కొని, ఈయన మహిమలను వర్ణించినవి. ఈతడు మయూరవాహనుడు. స్కందభగవానుని తల్లియైనందున దుర్గాదేవి ఐదవ స్వరూపమునకు స్కందమాత అను పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవములలో ఐదవ రోజున ఈ స్వరూపముతో దుర్గ ఆరాధింపబడుచుండును. ఈ దినమున మనస్సు విశుద్ధచక్రము నందు స్థిరమగును. ఈమె విగ్రహమునందు బాలస్కందుడు ఈమెయొడిలో కూర్చొనియుండును. స్కందమాత చతుర్భుజ, తన యొడిలో చేరియున్న స్కందుని తన ఒక కుడిచేతితో పట్టుకొనియుండును. మఱియొక కుడిచేతిని పైకెత్తి పద్మమును ధరించియుండును. ఎడమవైపున ఒక హస్తమున అభయముద్రను దాల్చి, మఱియొక కరమున కమలమును కలిగియుండును. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనముపై విరాజిల్లుతుండును. కనుక పద్మాసనగా ప్రసిద్ధికెక్కినది.ఈమెయు సింహవాహనయే.
నవరాత్రి ఉత్సవములలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొనినది. దాని మహా మహత్త్వమును గూర్చి శాస్త్రములు వేనోళ్ల శ్లాఘించినవి. ఈ విశుద్ధచక్రమునందు స్థిరమైన మనస్సుగల ఉపాసకునకు లౌకిక ధోరణులు, చిత్తవృత్తులు అంతరించును. అతడు విశుద్ధ చైతన్య స్వరూపమార్గమను పురోగమించును. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయా బంధములనుండి విముక్తమగును, పిమ్మట పద్మాసనమున ఆసీనయైన స్కందమాత స్వరూపమున పూర్తిగా లీనమగును. ఈ సమయమున సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనయందు ముందునకు సాగవలెను. అతడు తన ధ్యానవృత్తులయందే ఏకాగ్రతను కలిగియుండి, సాధనయందు పురోగమింపవలెను.